అంతా అయిపోలేదు, గాంధీ ఏం చెప్పారంటే: జయపై కరుణానిధి
చెన్నై: కర్నాటక హైకోర్టులో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అనుకూలంగా తీర్పు రావడంపై డీఎంకే అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్పందించారు. హైకోర్టు తీర్పుతోనే అంతా అయిపోలేదని ఆయన అన్నారు.
ఇది తుది తీర్పు కాదని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో తాను అందరికీ జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నానని చెప్పారు. అన్ని కోర్టుల కంటే ఆత్మసాక్షి అనేది అన్నింటి కంటే పెద్ద న్యాయస్థానమని అన్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో జరిగిన వాదనల ప్రస్తావనను కూడా తెచ్చారు.
కాగా, జయలలిత కేసులో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తుందని కర్నాటక అడ్వోకేట్ జనరల్ రవివర్మ కుమార్ చెప్పారు. తాము హైకోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని చెప్పారు. తాము తదుపరి స్టెప్ తీసుకునే ముందు దానిని పూర్తిగా చూడాల్సి ఉందన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై దాఖలైన అక్రమాస్తుల కేసులో సోమవారం కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతానని, జయకు శిక్ష పడేలా చేస్తానన్నారు. కోర్టు తీర్పు తనను అసంతృప్తి పరిచిందన్నారు. తీర్పు కాపీని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.