తమిళ సంక్షోభం: జయలలిత వైరాగ్యమే కారణమా?
నేనే లేకపోయిన తర్వాత ఏం జరిగితే ఏమిటనే జయలలిత వైరాగ్యమే తాజా తమిళ సంక్షోభానికి కారణమైంది. ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇదేనా...
చెన్నై: దాదాపు పాతికేళ్ల పాటు తమిళనాడు రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన దివంగత నేత జయలలిత వైరాగ్యమే ప్రస్తుత తమిళనాడు సంక్షోభానికి కారణమైనట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నాయకత్వం వహించిన అన్నాడియంకె బలహీనమై కొట్టుమిట్టాడుతోంది. బహుశా, ఎంజి రామచంద్రన్ కూడా పార్టీని అలాగే వదిలేశారు.
జయలలిత లేని లోటు అన్నాడియంకెను పట్టి పీడిస్తోంది. బిజెపి ఆడే క్రీడలో పార్టీలోని ఇరు వర్గాలు పాత్రధారులై కీచులాటకు దిగారు. తాను ఉన్నంత వరకు కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరినీ ఆమె పాదాక్రాంతం చేసుకున్నారు. అయితే, తన తర్వాత ఎవరనే విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. హీరో అజిత్ పేరును అందరూ చెబుతున్నప్పటికీ ఆయన దూరంగానే ఉండిపోయారు.
ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంటుందని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య మాటలు ఇప్పుడు నిజమనిపిస్తోంది. జయలలిత మరణంతో పార్టీలో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. అమ్మ కార్డు పట్టుకుని అధికారం కోసం శశికళ, పన్నీరు సెల్వం వీధిపోరాటాలకు దిగారు.
అమ్మ లేకపోతే మేం లేనని అన్నవారే...
అమ్మ లేపోతే తాము లేమని చెప్పినవారే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడుకుంటున్నారు. శశికళ అధికారానికి తలొగ్గినట్లే ఒగ్గి ఆ తర్వాత పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బిజెపి ఆడించే క్రీడలో ఆయన పావుగా మారారనే ప్రచారం సాగుతోంది. అధికారం కోసం శశికళ, పన్నీర్ సెల్వం ఇరువైపులా మోహరించి కత్తులు దూసుకుంటున్నారు.
నేనే లేని లోకంలో ఏం జరిగితే...
"నేనే లేని లోకంలో ఏమి జరిగితే నాకు ఎందుకు? అందుకునే నా వారసులను ప్రకటించడం లేదు" అని ఆస్పత్రిలో చేరడానికి ముందు జయలలిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. జీవితంలో అనేక అటుపోట్లను, అవమానాలను, అవహేళనలను ఆమె చవి చూశారు. వాటిని తట్టుకుంటూ పరిస్థితులకు ఎదురొడ్డుతూ తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఎవరైనా తన మాదిరిగా పోరాటం చేయాల్సిందేనని ఆమె ఉద్దేశం కావచ్చు. అధికారాన్ని, ఆస్తులను వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయారు. ఫలితంగా తమిళనాడు రాజకీయాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి.
జయ ప్రకటించకపోయినా...
జయలలిత తన వారసులను ప్రకటించకపోయినా ఓ వైపు శశికళ, మరో వైపు పన్నీర్ సెల్వం ఆమెకు వారసులం తామంటే తామేనని వీధి పోరాటానికి దిగారు. అధికారం కోసం పోటీ పడుతున్నారు. జయలలితకు అత్యంత సన్నిహితంగా, ఆమె నెచ్చెలిగా ఉంటూ వచ్చిన శశికళను నిజంగానే జయలలిత తన వారసురాలిగా భావించారా అంటే అవునని చెప్పలేని పరిస్థితే ఉంది. శశికళతో జయలలిత అంత సాన్నిహిత్యాన్ని ఎందుకు కోరుకున్నారనేది ఎవరికీ తెలియదు. మధ్యలో కొద్ది రోజులు తప్ప దాదాపు మూడు దశాబ్దాల పాటు తనతోనే ఉన్న శశికళను జయలలిత వారసురాలిగా ప్రకటించలేదు. నామమాత్రంగా కూడా ఆమె పేరును ప్రస్తావించలేదు.
పన్నీరుకే జయలలిత అప్పగించారు...
కోర్టు తీర్పు కారణఁగా అధికారం నుంచి తప్పుకోవాల్సిన వచ్చిన సందర్భాల్లో పన్నీరు సెల్వంకే అధికారం అప్పగించారు. కానీ మరొకరిని ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టలేదు. పన్నీరు సెల్వం కూడా జయలలిత అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. జయలలితకు తిరిగి అధికారం అప్పగించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడలేదు. ఒక రకంగా జయలలిత వద్ద ఆయన సాగిలబడ్డారు.