ఛీ!: కన్నీటి చెన్నై, బాహుబలి శివగామిగా జయలలిత (ఫోటో)
చెన్నై: ఓ వైపు చెన్నైని వరదలు ముంచెత్తుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులు 'బాహుబలి' వంటి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ (శివగామి) నీట మునుగుతూ బాహుబలిని చేతితో పైకెత్తి రక్షించిన సన్నివేశం తెలిసిందే.
ఇప్పుడు చెన్నై భారీ వర్షాలు, వరదల్లో కుట్టుమిట్టాడుతోంది. వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. చెన్నై మొత్తం చెరువును తలపిస్తోంది. మూడొంతుల శాతం విద్యుత్ లేదు. ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు.
గురువారం వర్షం కొంచెం తెరపి ఇచ్చాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చి కూరగాయలు, పాలు, నీళ్లు కొందామంటే... ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. నీళ్ల బాటిల్ ధర రూ.50 ఆ పైన, కూరగాయలు కిలో రూ.వంద, పాల పాకెట్ రూ.100గా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో 'అమ్మ' అభిమానులు బాహుబలి వంటి పోస్టర్ను ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ (శివగామి) బాహుబలిని పైకెత్తి రక్షిస్తుంది.
'అమ్మ' అభిమానులు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులో రమ్యకృష్ణ స్థానంలో జయలలితను ఉంచారు. ఆమె చిన్నారిని రక్షిస్తున్నట్లు పెట్టారు. తద్వారా వరదల్లో కొట్టుకుపోతున్న చెన్నైని, తమిళనాడును జయలలిత కాపాడుతుందని వారి అభిప్రాయం. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
రియల్ హీరో నటుడు సిద్ధార్థ
మరోవైపు, నటుడు సిద్ధార్థ వరద బాధితులకు తనవంతు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. చెన్నై వరదల నేపథ్యంలో అతను రియల్ హీరో అయ్యారు. అతను వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఆహారపొట్లాలు, నీళ్ల బాటిళ్లు, ఇతర అవసరమైన వస్తువులను అందిస్తున్నారు.