జయ మృతి: ఇద్దరు సినిమా, కరుణకు ప్రత్యర్థి లేరా?
మణిరత్నం ఇద్దరు సినిమాను, తమిళంలో ఇరువరు సినిమా చాలా మందే చూసి ఉంటారు. తమిళనాట ఇద్దరు మంచి మిత్రులు రాజకీయాల్లో శత్రువులుగా ఎలా మారారో తెలిసి వస్తుంది.
హైదరాబాద్: స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళ రాజకీయాల్లో డిఎంకె అధినేత కరుణానిధికి ప్రత్యర్థులు లేకుండా పోయారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తమిళనాడు రాజకీయాలను, సినిమాలను పరిశీలిస్తున్నవారికి మణిరత్నం తీసిన ఇరువరు, తెలుగులో ఇద్దరు సినిమా గుర్తుండే ఉంటుంది.
ఆ సినిమా ద్వారా ఇద్దరు వ్యక్తుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని, వ్యక్తిగత జీవితాలను ప్రేక్షకులు గుర్తించే ఉంటారు. ఇద్దరు సన్నిహిత మిత్రులు శత్రువులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారో ఆ సినిమా అద్భుతంగా చూపించింది.
కరుణానిధి, ఎంజి రామచంద్రన్లకు ఆ పాత్రలు ప్రాతినిధ్యం వహిస్తాయి. వారిద్దరి శత్రుత్వం తర్వాత అదే జయలలిత విషయంలోనూ పునరావృతమైంది. కరుణానిధికి జయలలిత రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యారు.
జయలలిత మృతికి కరుణానిధి సంతాపమే..
జయలలితకు లక్షలాది మంది ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. వారిలో సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆమెను కొనియాడుతున్నారు. ఆమె భౌతిక కాయాన్ని ఉంచిన రాజాజీ హాల్కు ప్రజలు, ప్రముఖులు పోటెత్తుతున్నారు. కానీ కరుణానిధి అర్పించిన నివాళి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫేమ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అని కరుణానిధి రాశారు.
ప్రత్యర్థులుగా ఎలా మారారు..
తమిళనాడు రాజకీయాలు ఎల్లవేళలా ఒకే రకంగా లేవు. కరుణానిధి, ఎంజిఆర్ దిగ్గజాల మాదిరిగా తలపడుతుంటే జయలలిత ఎక్కడో ఉండేవారు. కరుణానిధి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన మంచి మిత్రుడు ఎంజిఆర్ జయలలితను రాజకీయాల్లోకి తెచ్చారని, ఆమెతో తన అనుబంధం ఆమె కేవలం నటిగా ఉన్నప్పుడే ప్రారంభమైందని కరుణానిధి చెప్పారు.
రాజకీయ ప్రత్యర్థులుగా
సినిమా రంగంలో కలిసి పనిచేసిన జయలలిత, కరుణానిధి రాజకీయాల్లో ఒకరినొకరు తెలుసుకుంటూ వచ్చారు. ఎంజిఆర్ ద్రవిడ మున్నేత్ర కజగం నుంచి బయటకు వచ్చిన తర్వాత జయలలితకు, కరుణానిధికి మధ్య ఎడం పెరుగుతూ వచ్చింది. ఎంజిఆర్ను కరుణానిధి ఎలా చూసేవారో జయయలలితను కూడా అలాగే చూస్తూ వచ్చారు. ఆమె అన్నాడియంకె ద్వారా రాజకీయాల్లో ఎదగడం అందుకు కారణం.
ఎంజిఆర్ మంచి మిత్రుడు కూడా..
ఎంజిఆర్ మృతితో కరుణానిధి రాజకీయ ప్రత్యర్థిని మాత్రమే కాకుండా ఓ మంచి మిత్రుడ్ని కూడా కోల్పోయారు. జయలలిత మృతితో కరుణానిధి అటువంటి షాకే మరోసారి తగిలింది. రాజకీయాల్లో ప్రత్యర్థిని సినిమాల్లో స్నేహితురాలిని ఆయన కోల్పోయారు.
ఇద్దరి మధ్య పొలిటికల్ పవర్ ప్లే
మొదటి నుంచే కరుణానిధికి, జయలలితకు మధ్య పవర్ ప్లే ప్రారంభమైంది. ఎంజిఆర్ మృతి తర్వాత అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కరుణానిధికి లభించగా, రాష్ట్రంలోనూ పార్టీలోనూ తన ఉనికిని చాటుకోవడం, మనుగడ సాగించడం జయలలితకు అనివార్యంగా మారింది. కరుణానిధికి, జయలలితకు మధ్య రాజకీయ శత్రుత్వం పతాకస్థాయికి చేరుకుంది. ఒకరు అదికారంలో ఉంటే మరొకరు జైలులో ఉండడం అనే ఆనవాయితీ కూడా దాదాపుగా ప్రారంభమైంది.
విధేయులపైనే జయలలిత మనుగడ
డిఎంకెలో కుటుంబ రాజకీయాలు ప్రధానం కాగా, జయలలిత తన విధేయులపై మాత్రమే ఆదారపడ్డారు. ఇప్పుడు డిఎంకెకు స్టాలిన్ రూపంలో వారసుడు కనిపిస్తున్నాడు. కానీ అన్నాడియంకె పరిస్థితి అలా లేదు. నేతను కోల్పోవడంతో పార్టీ అనాథగా మారింది.