జయలలితపై కుట్ర లేదు, దాడి జరగలేదు, ఇలా మృతి: పన్నీరుకు ప్రభుత్వం షాక్
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్స వివరాలను తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసింది.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్స వివరాలను తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసింది. అమ్మకు అందించిన చికిత్సపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం పన్నీరు సెల్వం నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించారు.
పన్నీరు దీక్షకు దిగడానికి ముందే తమిళనాడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా జయలలితకు అందించిన చికిత్స వివరాలను విడుదల చేసింది. తద్వారా పన్నీరుకు చెక్ చెప్పే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం అధికారికంగా చికిత్స వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వం మొత్తం 19 పేజీల లేఖ విడుదల చేసింది.
ఆసుపత్రిలో చేరే సమయంలో..
గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన రాత్రి పది గంటలకు జయలలితను ఆసుపత్రికి తీసుకు వచ్చారని పేర్కొంది. ఆ సమయంలో అమ్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆసుపత్రికి రాగానే పరీక్షలు నిర్వహించారని చెప్పారు. డీహైడ్రేషన్తో పాటు ఇన్ఫెక్షన్, శ్వాస కోస ఇబ్బంది కనిపించిందన్నారు.
ఆసుపత్రిలో కుట్ర జరగలేదు
ప్రభుత్వం కోరిక మేరకే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని తెలిపారు. జయ మృతి పైన కొందరు నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆసుపత్రిలో ఎలాంటి కుట్ర జరగలేదని పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టుకు కూడా ఇదే నివేదిక ఇవ్వనున్నారు.
ఎక్మోతో కూడా కాపాడుకోలేకపోయాం
జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి నిపుణులైన వైద్యుల బృందంతో చికిత్స అందించినట్లు తెలిపారు. జయకు ఎక్మో చికిత్స అందించినా కాపాడుకోలేకపోయామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నాటి సీఎం పన్నీరు సెల్వంకు, ఇతర ప్రతినిధులకు చెప్పామని తెలిపారు.
అలా మృతి చెందారు
72 రోజుల చికిత్స తర్వాత డిసెంబర్ నాలుగో తేదీన జయలలితకు గుండెపోటు వచ్చిందని, ఈ కారణంగా ఆ తర్వాత ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. కొందరు నేతలు, పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా కుట్ర లేదన్నారు.
ఇంటివద్ద దాడి జరిగిన దానికి ఆధారాలు లేవు
మరోవైపు, అపోలో ఆసుపత్రిలో చేరే ముందు పోయెస్ గార్డెన్లో జయలలిత పైన దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని ఎయిమ్స్ నివేదికలో ఉందని పేర్కొన్నారు. జయ పైన దాడి జరిగిందని, ఆమె కిందపడటంతో గాయపడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
తప్పుడు మెడిసిన్స్ ఇవ్వలేదు
ఒబెసిటీ, హైపర్ టెన్షన్ కోసం జయలలిత అంతకుముందు నుంచే మెడిసిన్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. అలాగే, ఆమెకు ఎక్కడ కూడా తప్పుడు మెడిసిన్స్ ఇచ్చినట్లుగా గుర్తించలేదని పేర్కొన్నారు. తప్పుడు మెడిసిన్స్ ఇచ్చారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారం అన్నారు.
అపస్మారక స్థితిలో..
ఎయిమ్స్ నివేదిక ప్రకారం జయలలితను ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఎయిమ్స్ వైద్య బృందం జయలలితకు అందించిన చికిత్స వివరాలను ప్రభుత్వానికి ఇచ్చింది. దానిని ప్రభుత్వం విడుదల చేసింది.