జయలలిత మేనకోడలు దీపా అదృశ్యం, కారు డ్రైవర్ మాయం, పోలీసులు ఆరా, ఏం జరిగింది!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అదృశ్యం అయ్యారు. గత ఐదు రోజుల నుంచి దీపా జయకుమార్ జాడ లేకపోవడంతో ఆమె మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. దీపా జయకుమార్ తో పాటు ఆమె కారు డ్రైవర్ రాజా సైతం మాయం కావడంతో పోలీసులు గాలిస్తున్నారు.
Recommended Video
దీపా జయకుమార్, ఆమె భర్త మాధవన్ ల మధ్య విభేదాలు వచ్చాయి. మాధవన్ కొన్ని నెలల నుంచి వేరుగా నివాసం ఉంటూ ఇటీవలే చెన్నైలోని టీ నగర్ లో ఉన్న దీపా ఇంటికి చేరుకున్నాడు. దీపా కారు డ్రైవర్ రాజా సైతం టీ నగర్ లోని ఇంటికి వచ్చి వెళ్లడంతో మళ్లీ వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
కేసు పెట్టిన భర్త మాధవన్
దీపా భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజాల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. గత వారంలో దీపా భర్త మాదవన్ టీ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకుని కారు డ్రైవర్ రాజా మీద కేసు పెట్టారు. తనను చంపేస్తానని రాజా బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని మాధవన్ పోలీసులకు మనవి చేశారు.
భర్తను కాదని డ్రైవర్ కు మద్దతు
పోలీసులు రాజా మీద ఐపీసీ సెక్న్ సెక్టన్ 323, 506 (1) కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. శుక్రవారం టీ నగర్ పోలీస్ స్టేసన్ చేరుకున్న దీపా జయకుమార్ తన భర్త మాధవన్ చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని రాజాకు మద్దతుగా పోలీసులకు వివరణ ఇచ్చి తరువాత ఇంటికి వెళ్లిపోయారు.
శుక్రవారం నుంచి దీపా మాయం
శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దీపా జయకుమార్ తరువాత మాయం అయ్యారు. గత ఐదు రోజుల నుంచి దీపా ఆచూకి లేకపోవడంతో ఆమె మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. రాజా కోసం గాలిస్తున్న పోలీసులు అతని మొబైల్ సిగ్నల్స్ జార్ఖండ్ లో ఉన్నాయని గుర్తించారు.
జార్ఖండ్ లో దీపా జయకుమార్?
దీపా జయకుమార్ జార్ఖండ్ నుంచి చెన్నైలోని ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడారని వెలుగు చూసింది. కుటుంబ గొడవల కారణంగా అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ జార్ఖండ్ వెళ్లి ఉంటారని, ఆమెకు తోడుగా కారు డ్రైవర్ రాజా కూడా వెళ్లి ఉంటారని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిడి?
దీపా జయకుమార్ ఇటీవల పోయెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన వేదనిలయం ఆస్తి కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీపా జయకుమార్ కు రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఆమె మాయం అయ్యారా ? అంటూ ఆమె మద్దతుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.