జయలలిత పోయెస్ గార్డెన్ ఇల్లుతో సహ ఆస్తులు అటాచ్: హైకోర్టులో ఐటీ శాఖ అధికారులు, వడ్డీతో సహ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంతో 'సహ నాలుగు ఆస్తులను అటాచ్ చేశామని, వడ్డీతో సహ మొత్తం ఆదాయం పన్ను వసూలు చేస్తామని ఆదాయపన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టులో వివరణ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నుంచి ఆదాయపన్ను శాఖ కు రూ. 10. 12 కోట్ల పన్ను రావలసి ఉందని ఐటీ శాఖ అధికారులు మద్రాసు హైకోర్టులో చెప్పారు.
జయలలిత చెల్లించవలసిన ఆదాయపన్ను వసూలు చెయ్యడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? ఆమె ఆస్తులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ? అనే సమాచారం ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులకు జనవరి 3వ తేదీ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారులు మద్రాసు హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయ పన్ను శాఖకు వడ్డీతో సహ రూ. 10.12 కోట్లు ( డిసెంబర్ 31, 2018 వరకు) చెల్లించాలని, అందు కోసం పోయెస్ గార్డెన్ లో ని వేదనిలయంతో సహ ఆమెకు చెందిన నాలుగు ఆస్తులు అటాచ్ చేశామని మద్రాసు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
ఆదాయ పన్ను చెల్లించాలని జయలలిత కు 2007లో పోయెస్ గార్డెన్ లోని ఇంటికి, 2013లో చెన్నైలోని సెయింట్ మ్యారీస్ రోడ్డులోని ఆమెకు చెందిన ఇంటికి నోటీసులు జారీ చేశామని, అయినా ఆదాయ పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ అధికారులు మద్రాసు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టులో వాదనలు వినిపించారు. 2017 ఆగస్టు 17వ తేదీన జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ స్మారక భవనం చేస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనిస్వామి ప్రకటించారు. గుట్కా స్కాం కేసులో ఐటీ శాఖ అధికారులు 2017 లోనే వేదనిలయంలో సోదాలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.