సీల్డ్ కవర్ సీఎం, జయలలిత వారసుడు పన్నీరు సెల్వం
చెన్నై/బెంగళూరు: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంను ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రిగా ఇది రెండోసారి అవకాశం. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలులో ఉన్న నేపథ్యంలో ఆమె వారసుడిగా సెల్వంను అన్నాడీఎంకే శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జయలలిత కేబినెట్లో పన్నీర్ సెల్వం ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. అతనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాము పన్నీర్ సెల్వంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు త్వరలో గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి తీర్మానంను ఇవ్వనున్నారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఓ నిర్ణయానికి వచ్చినందునే ఆదివార ఉదయం ఒక సీల్డ్ కవర్ను ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్కు ఇచ్చి పంపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అన్ని పార్టీలకు భిన్నంగా అన్నాడీఎంకేలో నేతలు.. జయలలిత ఏం చెబితే అది చేస్తారు. ఆమె ఎవరిని సూచిస్తే వారికే సభ్యులు అందరూ మొగ్గు చూపుతారు. ఆమె చెప్పిన దానికి కార్యకర్తలు, నాయకులు, నేతలు వ్యతిరేకించే అవకాశాలు చాలాచాలా తక్కువ. ఈ నేపథ్యంలో జయలలిత.. సీల్డు కవర్లో పన్నీర్ సెల్వం పేరును సూచించినందున, అసంతృప్తులు కనిపించరనే చెప్పవచ్చు. సెల్వంను అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.