తమిళనాట 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన 'అమ్మ', కానీ కలిసి రాలేదు!
1984 తర్వాత, అంటే 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత జయలలితకే దక్కింది.
చెన్నై: ఈ ఏడాది మే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. 1984 తర్వాత, అంటే 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత జయలలితకే దక్కింది.
జయలలిత మృతి: అధికారిక ప్రకటన, పన్నీరు సెల్వం కొత్త ముఖ్యమంత్రి
ఇన్నాళ్లు ప్రతిసారి అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. కానీ 2016లో మొదటిసారి జయలలిత వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించారు. కానీ నాలుగు నెలల పాటే పాలించి, ఆ తర్వాత రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలో ఉండి జయ కన్నుమూశారు. 32 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన జయకు అది కలిసి రాలేదు!
గతంలో 1967 వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. 1967లో అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి అధికారం చేపట్టింది. అన్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు.
డీఎంకేను వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టారు. 1980, 1984 ఎన్నికల్లో వరుసగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. కానీ ఈ ఏడాది జయ సాధించారు.
1989లో డీఎంకే, 1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే, 2011లో అన్నాడీఎంకేలు విజయం సాధించాయి. అంటే, గత ముప్పై రెండేళ్లుగా అధికార మార్పిడి జరుగుతోంది. జయలలిత దానిని తిరగరాశారు.