అమ్మ మాట్లాడిందా! ఏం చెప్పింది? సోషల్ మీడియాలో 'జయలలిత ఆడియో'
చెన్నై : అమ్మ మాట కోసం.. అమ్మను చూసే క్షణం కోసం తమిళ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. అమ్మ గొంతుతో ఓ ఆడియో క్లిప్ బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఆ ఆడియో. తన అనారోగ్యం గురించి ప్రతిపక్ష పార్టీ కుయుక్తులు గురించి ప్రస్తావిస్తూ ఆ ఆడియో సాగుతుంటుంది.
13రోజులుగా ఆసుపత్రికే పరిమితమైన అమ్మ ఆరోగ్యం బాగుందని చెప్పడానికి ఈ ఆడియోనే నిదర్శనమని అమ్మ అభిమానులు చెబుతున్నారు. అయితే ఇది నకిలీ ఆడియో అనేవారు కూడా లేకపోలేదు. ఆడియో టేపుల్లో గొంతు అమ్మ గొంతులా లేదనేది వారి వాదన.
ఇంతకీ ఆ ఆడియో టేపులో ఏముందంటే..
"నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ.. నేను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తోన్న ప్రతీ ఒక్కరికి నా తరుపున కృతజ్ఞతలు, భగవంతుడి దయతో ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. పూర్తిగా కోలుకున్నాక మీ అందరిముందుకు వచ్చి మాట్లాడుతా.. నా అనారోగ్యానికి కారణమేంటో కూడా చెబుతా.. నా ఆరోగ్యం గురించి వస్తోన్న వదంతులను నమ్మవద్దు
అన్నాడీఎంకే శాంతియుత పాలనను చూసి ఓర్వలేకే ప్రతిపక్షం నా ఆరోగ్యం గురించి లేనిపోని వదంతులు వ్యాప్తి చేస్తోంది. కోట్లాది మంది మద్దతుదారుల ఆశీస్సులు, ఎంజీఆర్ సోదర సోదరీమణుల ప్రేమాభిమానులు ఉన్నంతకాలం నన్ను మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు
గతంలో చెప్పినట్టుగానే.. నేను మీకోసమే ఉన్నాను. కాబట్టి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించినట్టుగానే.. ఈ నెల 17,19వ తేదీల్లో జరగబోయే పంచాయితీ ఎన్నికల్లను రెండు ఆకుల గుర్తుకు ఓటేసి పార్టీకి ఘనవిజయం కట్టబెట్టండి. జై అన్నా.. జై ఎంజీఆర్.."
ఇవీ.. జయలలిత మాట్లాడిన మాటలుగా ఆడియో రూపంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి అమ్మ మాటలేనా కాదా అన్నదానిపై అన్నాడీఎంకే వర్గాల నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు.