ఆస్పత్రిలో జయ: టీవీలో చూసి గుండెపోటుతో అభిమాని మృతి
జయలలిత 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆమె ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై టీవీలో వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురైన ఓ అన్నాడీఎంకే నాయకుడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కడలూరి జిల్లాలో చోటు చేసుకుంది.
తమిళనాడులోని కడలూరి జిల్లా సన్యాసిపేటకు చెందిన నీలగండన్ అనే వ్యక్తి అన్నాడీఎంకేలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం ఉదయం జయలలిత ఆరోగ్యంపై అన్ని ఛానెల్స్లో వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం టీవీలో జయలలితను చూసిన నీలగండన్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మరణించారు. అతని మృతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్దకు ఆదివారం నుంచే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అమ్మకు ఏమైందంటూ కన్నీరు పెట్టుకున్నారు. భారీగా చేరుకోవడం వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వారు స్వల్ప లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా జయలలిత కోలుకోవాలంటూ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.