భోజనం చేయని జయలలిత: హైకోర్టులో అపీల్
బెంగళూరు: తనను దోషిగా తేలుస్తూ బెంగళూర్లోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైకోర్టుకు అపీల్ చేయనున్నారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తీర్పు వెలువడనున్న నేపథ్యంలో జయలలిత మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఇష్టపడలేదు.
జయలలితతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసలకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తూ శనివారంనాడు తీర్పు చెప్పింది. జయలలితపై కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అన్నాడియంకె కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
బెంగళూర్ ప్రత్యేక న్యాయస్థానం వద్ద వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బెంగళూర్ పరప్పన అగ్రహార జైలు పరిసరాల్లోని 5 కిలోమీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. ఇదిలావుంటే. తమిళనాడులోని కాంచీపురంలో జయలలిత అభిమానులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారు కడలూరు జిల్లాలో అన్నాడియంకె కార్యకర్తలు 20 బస్సులను ధ్వంసం చేశారు.
కాగా, తాము శాసనసభను రద్దు చేయాలని డిమాండ్ చేయబోమని ప్రతిపక్ష డిఎంకె స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రపతి పాలనను కూడా కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో డిఎంకె స్పందించింది.