రాజపక్ష: మోడీ ప్రమాణానికి జయలలిత, వైగో డుమ్మా
చైన్నై: కాబోయే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ సమస్య భారమయ్యేట్లే ఉంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించాలనే నిర్ణయం తీసుకోవడంతో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఎండింఎంకె నేత వైగో డుమ్మా కొట్టే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజపక్ష హాజరైతే తమిళ ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో వారున్నారు. శ్రీలంకలోని తమిళుల సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జయలలిత మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజపక్షను ఆహ్వానించాలనే బిజెపి నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఎల్టిటిఇపై పోరాటంలో కాంగ్రెసు ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి సాయం చేసిందని, ఇందులో వేలాది మంది తమిళ పౌరులు హతమయ్యారని వైగో బుధవారంనాడు అన్నారు. ఈ స్థితిలో రాజపక్షకు ఆహ్వానం పంపడం తమకు పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు
రాజపక్ష అధికారంలో ఉండగానే ఎల్టిటిఇపై పోరులో తమిళ పౌరులు శ్రీలంకలో మరణించారని వైగోతో పాటు పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. సార్క్ దేశాల నాయకులను ఆహ్వానిండంలో భాగంగానే శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానం వెళ్లిందని కేంద్రం సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉంది.