అమ్మ ఆస్తులు తెలంగాణ సర్కార్కు చెందేలా!; మృతిపై సీబీఐ విచారణ!?
అమ్మ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
హైదరాబాద్/చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలితకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ మరణంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఓవైపు చర్చ జరుగుతుండగానే.. ఆ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
హిందూ వారసత్వ చట్టం-1956లోని నిబంధనలను ఉటంకిస్తూ గరీబ్గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జి. భార్గవి ఈ పిల్ దాఖలు చేశారు. ఆ నిబంధనల ప్రకారం జయలలిత ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆస్తులకు సంబంధించి జయలలిత బంధు మిత్రులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, అంతదాకా వాటిని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించాలని హైకోర్టును కోరారు. పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జయలలిత సహచరి ఎన్.శశికళా నటరాజన్ల పేర్లను పేర్కొన్నారు.
అమ్మ మృతిపై సీబీఐ విచారణ:
నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన జయలలిత మరణంపై పలు అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి రోజుల్లో ఆమెకు జరిగిన చికిత్స.. చివరి రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సినీ నటి గౌతమి సైతం అమ్మకు జరిగిన చికిత్స వివరాలను వెల్లడించేలా చూడాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తమిళనాడు తెలుగు యువశక్తి బుధవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అమ్మ ఆరోగ్యం మెరుగైందని, మరో ఒకటి, రెండు రోజుల్లో ఆమె ఇంటికి వెళ్తారని అపోలో ప్రకటించిన కొన్ని గంటల్లోగానే ఆమె ఆకస్మికంగా మృతి చెందడం అనుమానాలను రేకెత్తిస్తోందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీషరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తులన్ని ఇతరులకు మార్పిడి కాకుండా చూడాలని కోరుతూ పిటిషన్ లో అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరపనుంది.