చిరస్థాయిగా జయ కీర్తి, ప్రతిష్టలు: కరుణానిధి స్పందన ఇది
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్పందించారు. జయలలిత పేరు, కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్పందించారు. జయలలిత పేరు, కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆమె మరణంపై ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పార్టీ సంక్షేమం, భవిష్యత్ కోసం జయలలిత ధైర్యంతో నిర్ణయాలు తీసుకున్నారనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే మృతిచెందినా.. ఆమె పేరు, కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతాయి అని కరుణానిధి ఓ ప్రకటనలో చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి.. ఏఐఏడీఎంకే పార్టీ శ్రేణులకు తన సానుభూతి తెలిపారు.
తమిళ రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి బద్ధశత్రువులు. కాగా, మంగళవారం ఉదయం డీఎంకే ట్రెజరర్, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్.. జయలలిత పార్థీవదేహం ఉన్న రాజాజీ హాల్కు వెళ్లి నివాళులర్పించారు. స్టాలిన్తోపాటు చెన్నై మాజీ మేయర్ ఎం సుబ్రమణియన్, మాజీ మంత్రులు కేఎన్ నెహ్రూ, పెరియసామి, ఈవీ వేలు.. జయకు నివాళులు అర్పించారు.
జయలలిత మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్టాలిన్ అన్నారు. ఆమె ఏ స్థానంలో ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు సృష్టించుకున్నారని తెలిపారు. డీఎంకే అధినేత కరుణానిధి తరఫున తాను పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.