నరనరాల్లో కాంగ్రెస్ రక్తం, బాధాకరమే: జయంతి నటరాజన్ గుడ్బై
చెన్నై: తన నరనరాల్లో కాంగ్రెసు రక్తం ఉందని, కాంగ్రెసు పార్టీని వీడడం బాధాకరమేనని మాజీ కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ అన్నారు. ఆమె కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తాను 30 ఏళ్లుగా కాంగ్రెసులో ఉన్నానని, తమ తాత కాంగ్రెసు ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆమె అన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పటి కాంగ్రెసు వేరు, ఇప్పటి కాంగ్రెసు వేరు అని ఆమె అన్నారు. ప్రస్తుత కాంగ్రెసులో విలువలు లేవని ఆమె విమర్శించారు.
మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు తాను చేసిన తప్పేమిటో చెప్పలేదని ఆమె అన్నారు. తనకు అవకాశాలు కల్పించిన కాంగ్రెసు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. నాలుగు తరాలుగా తమ కుటుంబం కాంగ్రెసుతో ఉందని, అటువంటి స్థితిలో కాంగ్రెసు పార్టీని వీడడం బాధాకరమనేనని ఆయన అన్నారు. తాను లేఖ రాశాననే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు నటరాజన్ తెలిపారు.
తన ఆలోచనను స్పష్టం చేయడానికి అది అవసరమని భావించినట్లు తెలిపారు. ఇది గుండె పగిలే రోజు అని అన్నారు. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు కాంగ్రెసులో కొనసాగే విషయంపై తనను పునరాలోచనలో పడేశాయని అన్నారు. 1986 నుంచి కాంగ్రెసు పార్టీకి అది అధికారంలో ఉన్నా, లేకున్నా సేవలందించానని అన్నారు.
తాను పదేళ్ల పాటు కాంగ్రెసు అధికార ప్రతినిధిగా పనిచేశానని, తనపై ఒక్క మచ్చ కూడా లేదని, పార్టీ ఇచ్చిన అవకాశాలకు తాను కృతజ్ఝతలు తెలుపుతున్నానని, తన బాధ్యతలను పూర్తి అంకిత భావంతో నిర్వహించానని జయంతి నటరాజన్ అన్నారు. తాను పర్యావరణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విధానాలను అమలు చేయాలనేది, ఎట్టి పరిస్థితిలోనూ పర్యావరణాన్ని పరిరక్షించాలనేది స్పష్టంగా ఉందని ఆమె అన్నారు.
ఎంతవరకు ప్రజాదరణ పొందిందనే విషయంతో ప్రమేయం లేకుండా పర్యావరణ పరిరక్షణకే నియమనిబంధనలకు అనుగుణంగా ప్రతి చర్యా తీసుకున్నట్లు తెలిపారు. భారీ ప్రాజెక్టుల కారణంగా పర్యావరణకు విఘాతం కలుగుతుందని ఆరోపిస్తూ ఓ ఎన్జీవో నుంచి వచ్చిన ఫిర్యాదును రాహుల్ గాంధీ పంపించారని ఆమె చెబుతూ పర్యావరణాన్ని పరిరక్షించేలా చూడాలని, భారీ ప్రాజెక్టులు పర్యావరణానికి దెబ్బ తగలకుండా చూడాలని రాహుల్ గాంధీ కార్యాలయం తనకు సూచించిందని ఆమె వివరించారు.
భారీ పెట్టుబడుల ప్రాజెక్టులను తాను ఆపేయడం మంత్రివర్గంలోని చాలా మందికి నచ్చలేదని, ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని తన మంత్రివర్గ సహచరులు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. తన నాయకుడి సూచించిన పార్టీ పంథాను తాను పాటించానని, అటవీ హక్కులను రక్షించాలని సోనియా గాంధీ కూడా సూచించారని ఆమె చెప్పారు. ఆదానీ ప్రాజెక్టు విషయంలో తాను రాహుల్ గాంధీ కార్యాలయానికి సమాచారం అందించానని ఆమె చెప్పారు.