రాహుల్ మార్పులు: జయంతి నటరాజన్ రాజీనామా
న్యూఢిల్లీ: మంత్రి పదవికి జయంతి నటరాజన్ శనివారంనాడు రాజీనామా చేశారు. ఆమె పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఆమె నిర్వహిస్తున్న శాఖను కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగించారు. జయంతి నటరాజన్ పార్టీ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మార్పులు తేవడానికి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యాచరణలో భాగంగానే జయంతీ నటరాజన్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పనిచేయడానికి మరింత మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
లోకసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. ఈ స్థితిలో రాహుల్ గాంధీ పార్టీకి సీనియర్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్పులు తేవాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ గుర్తించినట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆయన పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు.