జయప్రద నామినేషన్: నగ్మాకు షాక్, పోలీసులపై ఫైర్
లక్నో: ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డి) పార్టీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్తో ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగిన ఆర్ఎల్డి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలో విజయం సాధిస్తుందని జయప్రద ఈ సందర్భంగా అన్నారు.
అభివృద్ధి విషయంలో ప్రజలు తమని సమర్థిస్తారని వెల్లడించారు. బిజ్నోర్ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభిస్తుందనే ఆశిస్తున్నానని, తప్పక తనను గెలిపిస్తారని అన్నారు. రాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జయప్రద ఇటీవలే ఆర్ఎల్డి పార్టీలో చేరారు.
ఇదిలావుంటే, మరో సినీ నటి నగ్మాకు షాక్ తగిలింది. మీరట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా నగ్మా శనివారంనాడు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే, ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేయలేకపోయారు. నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చిన వ్యక్తిని పోలీసులు కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించలేదని, దీంతో తాను నామినేషన్ వేయలేకపోయానని ఆమె అన్నారు.
పత్రాలను, అఫడవిట్లను తెస్తున్న జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు సలీం భారతిని పోలీసులు లోనికి అనుమతించలేదని, కలెక్టర్ కార్యాలయం గేటు వద్దనే ఆపేశారని ఆమె చెప్పారు. ప్రతి అభ్యర్థితో ఐదుగురు వ్యక్తులు లోనికి రావచ్చు. రేపు నామినేషన్ దాఖలు చేస్తానని, ఈ విషయంపై సీనియర్ పార్టీ నాయకులతో మాట్లాడుతానని ఆమె చెప్పారు.