తెలుగు రాష్ట్రాలపై ఊరింపేనా?: జయప్రద యూ టర్న్
లక్నో: అలనాటి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద యూ టర్న్ తీసుకోనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. జయప్రద తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
శాసన మండలికి ఎన్నికయ్యేందుకు ఆమె సమాజ్ వాది పార్టీలో చేరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సమాజ్ వాది పార్టీలో ఉన్న జయప్రద... అమర్ సింగ్ వెంట కలిసి ఆ పార్టీని వీడారు. ఇప్పుడు ఆమె తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరి, ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
జయప్రద రాజకీయ రంగ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. ఆ తర్వాత ఆమె ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లారు. రాంపూర్ ఎంపీగా పని చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పలుమార్లు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన జయప్రద... తాను త్వరలో ఇక్కడకు వస్తానని ఊరించారు. దీంతో, సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఏపీ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. రాజమండ్రి లోకసభ స్థానం తదితరాలు వినిపించాయి. కానీ ఆమె రాలేదు. ఇప్పుడు తిరిగి ఎస్పీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.