పాక్ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్లో 3 ముష్కరులు హతం
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
సరిహద్దులోని నౌషీరా సెక్టార్ లో గల కల్సియాన్, ఖాంగర్, భవానీ ప్రాంతాల్లోని భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని, అప్రమత్తమైన భారత బలగాలు దీటుగా జవాబిచ్చాయని, ఈ క్రమంలో ఆర్మీకి చెందిన జేసీవోకు బుల్లెట్ గాయాలు కాగా, హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని, అయితే, చికిత్స అందేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడని అధికారులు వివరించారు.
జమ్మూలోని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ సైతం జేసీవో మృతిని ధ్రువీకరించారు. మధ్యాహ్నం తర్వాత కూడా పాకిస్తాన్ పైరింగ్ జరుపుతూనే ఉన్నదని, మనవాళ్లు కూడా గట్టిగా తిప్పికొడుతున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగడం పరిపాటిగా మారింది. గతేడాది పాక్ మోర్టార్ షెల్లింగ్ దాడుల్లో పౌరులు, ఆర్మీ సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే..
Recommended Video
జమ్మూ సిటీలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతమైపోగా, ఓ ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి శ్రీనగర్ లోని పంతా చౌక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాలు కాల్పులు జరిపి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. పారిపోయిన టెర్రరిస్టులు.. ఓ ఇంట్లో నక్కి మరోసారి కాల్పులు జరిపారు. గంటలపాటు సాగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు హతంకాగా, జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన బాబూరామ్ అనే ఏఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయారు.