లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కుమారస్వామి ప్రత్యేక పూజలు
బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జెడి(ఎస్) అధినేత కుమారస్వామి హసన్ లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.
కర్ణాటక రాష్ట్రంలో మే 19వ తేదిన విశ్వాస పరీక్షకు ముందే బిజెపి నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్, జెడి(ఎస్ఏ కూటమి తరపున జెడి(ఎస్) నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించనున్నారు.
అయితే ఢిల్లీకి వెళ్ళే ముందు కుమారస్వామి హసన్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక పూజలు చేసినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సమావేశం కానున్నారు. అనంతరం 4:30 గంటలకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అవుతారు. కర్ణాటక మంత్రిమండలి కూర్పు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, సమన్వయ కమిటీ ఏర్పాటుపై చర్చిస్తారు.
ముఖ్యంగా ప్రభుత్వ స్థిరత్వంపై కుమారస్వామి దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని ఆయన ఇదివరకే కుండబద్దలుకొట్టారు. మరోవైపు రొటేషన్ సీఎంకు జేడీఎస్ కూడా నో చెబుతోంది. కీచులాటలు, విభేదాలతో కూటమిని విచ్ఛిన్నం చేయవద్దన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. బీజేపీని నిలువరించడం కోసం ఐదేళ్ల పాటు కూటమికి బీటలు వారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు.