కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ: పోలీసులతో ఘర్షణ
బెంగుళూరు: పోలీసుల మీద జులుం ప్రదర్శించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కోర్టులో లొంగిపోయారు. జాతరలో జరిగిన ఓ ఘర్షణలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానిక ఎస్ఐ, సీఐలను దూషించడం అక్కడి టీవీ చానెళ్లలో ప్రసారమైంది.
దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్సీ కోర్టులో ఎమ్మెల్యే బాలకృష్ణ లొంగిపోయారు. ఘటన విషయానికొస్తే.. అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది.
ఘటనలో ఇరువర్గాలు దాడులకు దిగారు. దీంతో తమ వర్గం వారి మీద దాడి చేసినవారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐల మీద ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసభ్య పదజాలంతో వారిని దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి.
విషయం తెలుసుకున్న కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేష్ కు ఫిర్యాదు చేశారు. పైగా ఎమ్మెల్యే పోలీసులను దూషించిన చిత్రాలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఆయనపై కూదూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే తనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమయ్యారన్న విషయం తెలియగానే ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్సీ కోర్టులో లొంగిపోయారు.