బీజేడీయూ ఓటమికి అదే ప్రధాన కారణం: మిత్రపక్షం జేడీయూ, ‘నితీష్పై ప్రజల ప్రతీకారం’
పాట్నా: తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కీలక స్థానాలను చేజార్చుకుంది. బీహార్లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి అభ్యర్థిపై జేడీయూ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా భావించిన జోకిహాట్ ఉపఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
కాగా, ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, అందుకే తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని త్యాగి డిమాండ్ చేశారు.
ఇది ఇలావుంటే, ఉపఎన్నికల్లో గెలుపుతో ఆనందంలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్.. సీఎం నితీష్ కుమార్పై మండిపడ్డారు. జోకిహాట్లో జేడీఎస్కు వచ్చిన ఓట్లు తమ మెజారిటీ కన్నా తక్కువేనని అన్నారు.
యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తుపెట్టుకున్న నితీష్పై ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారని, అందుకు తాజా ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, తమ కుటుంబంపై ఉసిగొల్పుతున్నారని తేజస్వి ఆరోపించారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్న సీఎం నితీష్కు ఈ ఉపఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.