దారుణం: జేడీయూ నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జేడీయూ పార్టీ నేతను కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఈ ఘటన మాధేపురా జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అశోక్ యాదవ్(50) అనే జేడీయూ నేతను కాల్చి చంపారు. జేడీయూ గ్రామహరీయా బ్లాక్ ప్రెసిడెంట్ అయిన అశోక్ యాదవ్.. తన స్వగ్రామం జోగ్భానీలో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని మాధేపురా సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్ వాషి అహ్మద్ తెలిపారు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అశోక్ యాదవ్ను సుపాల్ సదర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అశోక్ యాదవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Recommended Video
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం యాదవ్ మృతదేహాన్ని మాధేపురా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.