రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ సింగ్ - ఆర్జేడీ అభ్యర్థిపై విజయం - ప్రధాని సహా పలువురి అభినందన
రాజ్యసభలో కీలకమైన డిప్యూటీ చైర్మన్ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రతిపాదించగా, థావర్ చంద్ సమర్థించారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాపై హరివంశ్ విజయం సాధించినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
తొలుత 2018లో కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ సింగ్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ లో ముగిసింది. రెండోసారి ఆయననే అభ్యర్థిగా నిలపాలని ఎన్టీఏ కూటమి డిసైడైంది. మొత్తం 245 స్థానాలున్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 113 మాత్రమే కావడంతో.. హరివంశ్ కు మద్దతు కోసం ఇతర పార్టీలను జేడీయూ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపగా, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా నిలిచింది.
యూపీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఓడిపోయినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీల నేతలు.. విజేత హరివంశ్ సింగ్ కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్ బాధ్యతలను హరివంశ్ సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు.
Recommended Video
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన జేడీయూ నేత హరివంశ్ సింగ్ కు ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో శుభాభినందనలు తెలిపారు. జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా హరివంశ్ ఎంతోమందికి ఇష్టుడయ్యారని, అదే విధంగా ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా ఆయన హుందాగా నిర్వహించబోతుండటం మనం చూడబోతున్నామని, గడిచిన రెండేళ్లలో సభలో వ్యవహరించిన తీరు ఆయన నిబద్ధతకు తార్కాణమని, ఈ సందర్భంగా హరివంశ్ కు అభినందనలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.