బీహార్లో బీజేపీ-జేడీయు మధ్య సీట్ల చిచ్చు, 20-20 ఫార్ములాపై అసహనం
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాలపై చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. బీహార్లో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. 20 -20 ఫార్ములాతో బీజేపీ జేడీయు ముందు ప్రతిపాదన పెట్టింది. దీని పట్ల జేడీయూ అసంతృప్తితో ఉంది.
సమాచారం మేరకు బీజేపీ ఇరవై సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిగతా ఇరవై స్థానాల్లో 12 జేడీయూ, 6 రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి పార్టీ, రెండు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీకి ఇస్తామని ప్రతిపాదన చేస్తోంది. బీజేపీకి 20, ఇతర పార్టీలకు ఇరవై అని చెబుతోంది.
దీనిపై జేడీయూ అసంతృప్తితో ఉంది. ఆ సీట్ల పంపిణీ తమకు ఆమోదం కాదని, లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ చేస్తోన్న ప్రతిపాదన తమకు గౌరవప్రదంగా లేదని అంటున్నారు. బీజేపీకి 17, తమకు 17 ఉండాలని, మిగిలిన ఆరు లోక్జన్శక్తి పార్టీకి ఇవ్వాలని జేడీయు ప్రతిపాదిస్తోంది. ఉపేంద్ర కుష్వాహా ఎన్డీయేలో ఉండదల్చుకోలేదని సంకేతాలు ఇస్తున్నారని, కాబట్టి ఆయనకు సీట్లు అవసరం లేదని చెబుతున్నారు.
మరోవైపు సీట్ల వాటా ఖరారు కాలేదని బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ అన్నారు. 2014లో ఎన్డీయే 31 స్థానాల్లో గెలవగా బీజేపీ 22 స్థానాలు గెలిచిందని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచిందని, మళ్లీ ఎన్డీయేలోకి వచ్చిన జేడీయూ తమకు గౌరవప్రద సంఖ్యలో సీట్లు కేటాయించాలని కోరుతోందని అంటున్నారు.