మాజీ ప్రధాని దేవేగౌడ మాస్టర్ ప్లాన్: ఆరు షరతులకు కాంగ్రెస్ ఓకే, అగ్రిమెంట్, సీఎం పదవి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చక్రం తిప్పుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నివాసం రాజకీయాలకు కేంద్రబింధువు అయ్యింది. తాజాగా సీఎం కుమారస్వామి సీఎం పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండకాదని కాంగ్రెస్ పార్టీ నాయకులతో దేవేగౌడ ఆరు షరుతలపై సంతకాలు చేయించుకున్నారని వెలుగు చూసింది.
దేవుడు కరుణించాడు
ముద్దుల కొడుకు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని అనేక సార్లు దేవేగౌడ బహిరంగంగానే చెప్పారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఆశించినట్లు దేవుడు కరుణించడంతో కర్ణాటకలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ కు కలిసి వచ్చింది.
బీజేపీకి అధికారం రాకూడదు
కర్ణాటక 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చి అతి పెద్ద పార్టీగా అవంతరించిన బీజేపీ అధికారంలోకి రాకూడదు అనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఇంటి తలుపు తట్టింది. ఇదే సమయంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీకి దూరంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జేడీఎస్ అధినేత దేవేగౌడ మీద ఒత్తిడి తీసుకు వచ్చాయి.
దేవేగౌడకు రెండు వైపుల లాభం
చేతికి చిక్కిన అవకాశాన్ని దేవేగౌడ రెండు వైపుల నుంచి లాభంపొందారు. కొడుకును సీఎం చెయ్యాలని దేవేగౌడ కోరిక తీరిపోయింది. ఐదు సంవత్సరాల సీఎం, 30 నెలల సీఎం అనే విషయంపై క్లారిటీ వచ్చింది. మరో వైపు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కుమారస్వామి ప్రమణాస్వీకారానికి ఆహ్వానించిన దేవేగౌడ 2019లో జరిగే లోక్ సభ ఎన్నికలకు కొత్త అధ్యాయానికి తెరతీశారు.
దేవేగౌడ మాస్టర్ ప్లాన్
జూన్ 1వ తేదీ శుక్రవారం బెంగళూరులోని దేవేగౌడ ఇంటిలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు మంత్రి పదవుల పంపకంపై చర్చలు జరిపారు. ఆ సమయంలో ఇరు పార్టీల కార్యదర్శులు హాజరైనారు. మంత్రి పదవుల పంపకం జరగక ముందే ఆరు షరతులు, ఒప్పందాలపై ఇరు పార్టీల నాయకులు సంతకాలు చేశారని సమాచారం.
జేడీఎస్-కాంగ్రెస్ షరతులు
- వచ్చే ఎన్నికల వరకూ జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుంది. ఎన్నికలు సమీపించిన సమయంలో ఏపార్టీకి ఏ ని యోజక వర్గం కేటాయించాలి అనే విషయం అప్పుడు చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
- కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇరు పార్టీల నేతల మధ్య సమస్యలు ఎదురుకాకుండా చూడటానికి సమన్వయ కమిటీ ఏర్పాటు. ఏ పార్టీకి నామినేటెడ్ పదవులు కేటాయించాలి అనే నిర్ణయం సమన్వయ కమిటీ తీసుకుంటుంది.
- ఎన్నికల సమయంలో రెండు పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలి.
- కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సీఎంగా కుమారస్వామి కొనసాగాలి. మంత్రి వర్గంలో కాంగ్రెస్ పార్టీకి అగ్రస్థానం. కాంగ్రెస్ పార్టీకి 2/3 వంతు, జేడీఎస్ కు 1/3 వంతు మంత్రి పదవులు కేటాయింపు.
- సంకీర్ణ ప్రభుత్వం దిన చర్యలు, ప్రముఖ కార్యకలాపాలు, వివరాలు వెల్లడించడానికి ఇరు పార్టీలకు చెందిన కార్యదర్శులను నియమించాలి.
- మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చెయ్యాలని. సమన్వయ కమిటీలో సీఎం కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణగోపాల్, జేడీఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డానిష్ ఆలీని సభ్యులుగా నియమించాలి.
ఐదు ఏళ్లు సీఎం
అగ్రిమెంట్ తరువాతే!
పై ఆరు షరతులు, ఒప్పందాల మీద జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతకాలు చేసిన తరువాతే ఇరు పార్టీల నాయకులు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి ఏ పార్టీకి ఏ మంత్రి పదవులు అనే విషయం బహిరంగంగా చెప్పారని సమాచారం.