ఎమ్మెల్యేల అసమ్మతి, సీఎం కుమారస్వామికి ఇంటి పోరు, సోదరుడి పట్టు, లేకుంటే, దేవుడా!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకంలో తేడా రావడంతో అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో ఇరు పార్టీల నేతలు తలలుపట్టుకుంటున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడానికి సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఇంటిపోరు మొదలైయ్యింది. తనకు రెండు శాఖలు అప్పగించాలని సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ పట్టుబట్టారని తెలిసింది.
అన్మదమ్ముల సవాల్
అన్నదమ్ముల మద్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో జేడీఎస్ నేతలు ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు శాఖలు ఇవ్వాలని కోరుతున్న సోదరుడు హెచ్.డి. రేవణ్ణకు ఎలాగైనా నచ్చచెప్పాలని సీఎం కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఎంకు భయం
కర్ణాటక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హెచ్.డి. రేవణ్ణ తనకు విద్యుత్ శాఖ, పీడబ్ల్యూ శాఖ ఇవ్వాలని సోదరుడు సీఎం కుమారస్వామిని డిమాండ్ చేశారని తెలిసింది. ఒక్కొక్కరికి రెండు రెండు శాఖలు ఇస్తే మీడియా, ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని కుమారస్వామి భయపడుతున్నారని తెలిసింది.
పట్టుకోసం ప్రయత్నం
సొంత సోదరుడు కావడం వలనే రేవణ్ణకు సీఎం రెండు శాఖలు ఇచ్చారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని కుమారస్వామి ఆందోళన చెందుతున్నారని సమాచారం. కుమారుడు ప్రజ్వల్ కు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించడానికి హెచ్.డి. రేవణ్ణ తీవ్రస్థాయిలో ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు ఎలాగైనా రెండు శాఖలు తీసుకుని పార్టీలో పట్టుసాధించాలని రేవణ్ణ ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
కాంగ్రెస్ ఫార్ములా
ఒక్కరికి ఒకే శాఖ అనే కాంగ్రెస్ ఫార్ములాను మనం అనుసరించాలని కుమారస్వామి అంటున్నారని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రంలోపు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సహాయంతో సోదరుడు రేవణ్ణకు నచ్చచెప్పాలని కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.