కర్ణాటకలో హంగ్: కాంగ్రెస్ తో పొత్తుకు జేడీఎస్ గ్రీన్ సిగ్నల్, గవర్నర్ కు లేఖ, బీజేపీ ఆశలపై నీళ్లు!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుకు అంగీకరించిన జేడీఎస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలాకు లేఖ రాసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.
బెంగళూరు నగరంలోని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ నివాసంలో హెచ్.డి. కుమారస్వామి మంగళవారం దాదాపు మూడు గంటల పాటు చర్చించి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా జేడీఎస్ కు మద్దతు ప్రకటించింది.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు మంత్రి వర్గం నిర్ణయాలు మొత్తం జేడీఎస్ కు వదిలిపెట్టిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ ఒక్కటి కావడంతో మెజారిటీకి మించిన శాసన సభ్యులు వారి పక్షాన నిలిచారు.
104 సీట్లు సంపాధించిన బీజేపీ ఇప్పుడు అధికారానికి దూరం కావలసిన పరిస్థితి ఎదురైయ్యింది. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి అర్థం కావడంలేదు. బీజేపీ నాయకులకు చాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు ముందుగానే జేడీఎస్ నాయకులను సంప్రధించి బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు.