సుమలత మద్దతుదారులపై హత్యాయత్నం, రెచ్చిపోయిన జేడీఎస్ కార్యకర్తలు, సీఎం అండ ?
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని చిత్తుచిత్తుగా ఓడించిన స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత అనుచరుల మీద జేడీఎస్ కార్యకర్తలు ప్రతీకార దాడులు చేస్తున్నారు. సుమలత మద్దతుదారుల మీద జేడీఎస్ కార్యకర్తలు హత్యాయత్నం చెయ్యడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మండ్య జిల్లా మద్దూరు సమీపంలోని కూళగెరే గేట్ సమీపంలో వెలుతున్న సుమలత మద్దతుదారులు శశిధర్, కుమార్ అనే ఇద్దరి మీద జేడీఎస్ కార్యకర్తలు కులదీప్, ప్రమోద్, వరుణ్, అభిషేక్ తదితరులు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేశారు. మా నాయకుడు నిఖిల్ కుమారస్వామి ఓటమికి మీరు పని చేస్తారా అంటూ దాడులు చేశారు.
సుమలత మద్దతుదారులకు తీవ్రగాయాలై కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు సుమలత మద్దతుదారులను రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమలతకు మద్దతు ఇస్తే ఇదే పరిస్థితి ఎదురౌతుందని జేడీఎస్ కార్యకర్తలు స్థానికులను హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు మద్దూరులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమలత మద్దతుదారుల మీద దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని, వెంటనే వారిని అరెస్టు చేస్తామని మద్దూరు పోలీసులు తెలిపారు. మా కార్యకర్తల మీద హత్యాయత్నం చేసిన జేడీఎస్ కార్యకర్తలను అరెస్టు చెయ్యాలని సుమలత మద్దతుదారులు ధర్నా చేశారు. సుమలత మద్దతుదారులకు నచ్చ చెప్పిన పోలీసులు జేడీఎస్ కార్యకర్తలను అరెస్టు చేస్తామని హామి ఇచ్చారు.