జేడీఎస్ మంత్రి పదవులు: కులాల లెక్కలు: ఒక్కలిగులు, సిద్దూను చిత్తుగా ఒడించిన ఎమ్మెల్యేకి!
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం దాదాపు ఖరారు అయ్యింది. ఇప్పుడు మంత్రి పదవుల కేటాయింపుపై ఇరు పార్టీల నాయకులు దృష్టిపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, జేడీఎస్ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అని చర్చలు జరుగుతున్నాయి. జేడీఎస్ నాయకులు కులాల వారిగా మంత్రి పదవులు కేటాయించాలని దాదాపు నిర్ణయించారు. సిద్దూను చిత్తుగా ఓడించిన ఎమ్మెల్యేకి కీలక మంత్రి పదవి ఇవ్వనున్నారు.
Recommended Video
జేడీఎస్ నిర్ణయం
జేడీఎస్ పార్టీ ఇప్పటికే మంత్రి పదవులు కేటాయించే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. స్పీకర్ పదవితో పాటు 13 మంత్రి పదవులు కావాలని జేడీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో కలిపితే 14 పదవులు జేడీఎస్ సొంతం అవుతాయి.
కులాలకు ప్రధాన్యం
జేడీఎస్ పార్టీ కులాల వారిగా అందరికీ ప్రధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే తరువాత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని జేడీఎస్ నిర్ణయించింది. అందుకే పార్టీలో గెలిచిన అన్నికులాల ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మంత్రి పదవులు పంచి పెట్టాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కుమారస్వామి నిర్ణయించారని సమాచారం.
ఒక్కలిగులకు అగ్రస్థానం
ఒక్కలిగులు (గౌడ)కు అధిక ప్రధాన్యత ఇచ్చి 5 కీలక మంత్రి పదవులు ఇవ్వాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్.డి. కుమారస్వామి ఆలోచిస్తున్నారు. 37 మంది ఎమ్మెల్యేలలో (కుమారస్వామి రెండు చోట్ల గెలిచారు) 23 మంది ఒక్కలిగ కులస్తులే ఉన్నారు.
వీరశైవ-లింగాయుత
జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయిన వీరశైవ-లింగాయుత కులస్తులకు రెండు మంత్రి పదవులు, ఎస్సీలలో ఒక మంత్రి పదవి, ఎస్టీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీఎస్ నిర్ణయించింది. 23 మంది ఒక్కలిగ ఎమ్మెల్యేలలో ఐదు మందికి మంత్రి పదవులు ఇవ్వాలని జేడీఎస్ ఆలోచిస్తోంది.
సీఎంను ఓడించారు
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గంలో అప్పటి సీఎం సిద్దరామయ్యను చిత్తుచిత్తుగా ఓడించిన జీటీ. దేవేగౌడకు కీలక మంత్రి పదవి ఇవ్వాలని మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామి నిర్ణయించారు. ఇక బండప్ప ఖాశంపురకు కీలక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.