సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా లేకున్నా హాసన్ లో మేము పోటీ చేస్తాం, నో డౌట్, సీఎం కుమార సోదరుడు !
బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, లేకున్నా తాము మాత్రం హాసన్ లో పోటీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ అన్నారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్లకు తాము అంగీకరించమని మంత్రి రేవణ్ణ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఆ సందర్బంలో హాసన్ లోక్ సభ సీటు కాంగ్రెస్ కు ఇవ్వాలని, అందుకు జేడీఎస్ ను ఒప్పించాలని మంత్రి ఎ. మంజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పెద్ద చర్చ జరిగింది.
ఈ విషయంపై మాట్లాడిన సీఎం సోదరుడు, మంత్రి రేవణ్ణ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా, లేకున్నా హాసన్ లో తామే పోటీ చేస్తామని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు హాసన్ నియోజక వర్గం వదిలిపెట్టమని అన్నారు. హాసన్ లో రేవణ్ణ కుటుంభానికి మంత్రి మంజు ఏకుమేకై కుర్చున్నారు.
మాజీ ప్రధాని దేవేగౌడ హాసన్ లో పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని, రేవణ్ణ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే తాము మద్దతు ఇవ్వమని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి ఎ. మంజు తేల్చి చెప్పారు. హాసన్ నుంచి మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు.