బీజేపీతో కలిసే 2019 ఎన్నికల్లో పోటీచేస్తాం: జేడీయూ
నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏతోనే కలిసి వెళుతుందని ఆపార్టీ అధినాయకత్వం ఢిల్లీలో ప్రకటించింది. అయితే మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్ఘఢ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొన్ని సీట్లలో ఒంటరిపోరు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీ చేస్తుందో నిర్ణయం తర్వాత వెల్లడిస్తామని పార్టీ నాయకత్వం తెలిపింది.
జేడీయూ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఇదే విషయమై మాట్లాడారు. ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనేదానిపై జాతీయ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి జేడీయూ బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తం లేదన్నారు. అధికారికంగా ప్రకటించాకే ఇలాంటి రూమర్లకు అడ్డుకట్టపడుతుందని త్యాగి వెల్లడించారు.
మరోవైపు బీహార్ డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుషీల్ మోడీ మాత్రం ... జేడీయూ బీజేపీతో కలిసి నడిచేందుకే నిర్ణయించుకున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే లాలూ పార్టీ ఆర్జేడీతో జతకట్టేది లేదని త్యాగి స్పష్టం చేశారు. లాలూతో పేచీ ఇలా ఉంటే... కాంగ్రెస్తో పొత్తుతో వెళ్లాలంటే హస్తం పార్టీ ఆర్జేడీపై స్పష్టత ఇవ్వాలని చెబుతూ బంతిని కాంగ్రెస్ కోర్టులోనే జేడీయూ వదిలేసింది. మహాకూటమి వదిలే ముందు లాలూ అవినీతి గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించామని... అయితే రాహుల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని త్యాగి చెప్పారు. అవినీతిపై రాహుల్ గాంధీ స్టాండ్ క్లియర్గా లేదని విమర్శించారు. అవినీతి ఆర్జేడీతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోకపోతే వారితో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదని జేడీయూ స్పష్టం చేసింది.