పోలీసుల మజాకా..!! అధికార పార్టీ నేతకు వేధింపులు, పీఎస్ టాయిలెట్లో ఆత్మహత్య
పాట్నా : పోలీసుల మజాకా.. అవును ఖాకీలంటే మమూలు విషయం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ ప్రతినిధులైనా సరే స్టేషన్ పిలిచి మరీ విచారిస్తారు. ఎంక్వైరీ చేస్తే సరే .. కానీ ఆ వేధింపులు తాళలేక స్టేషన్లో ఆత్మహత్య చేసుకునే వరకు టార్చర్ చేస్తారు. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే మరోవైపు తాటా తీస్తున్నారు. బీహర్లో అధికార జేడీయూ దళిత నేత పోలీసు స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఓ అమ్మాయి ప్రేమ విషయంలో సహకరించారనే ఆరోపణలతో .. కేసు లేకుండా విచారించి, బలవన్మరణానికి కారణమయ్యారు ఖాకీలు.
నేతకు తప్పని వేధింపులు ..
బీహర్లోని నలంద జిల్లా నగర్నౌసా పోలీసుస్టేషన్ పరిధిలో గనేశ్ రవిదాస్ (45) ఉంటున్నారు. ఈయన అధికార జేడీయూ బ్లాక్ నేత కూడా. అయితే ఇటీవల ఓ అమ్మాయి ప్రేమ విషయంలో సాయం చేయాలని అడుగడంతో హెల్ప్ చేశాడు. దీంతో అమ్మాయి తండ్రి రవిదాస్పై కక్ష పెంచుకున్నాడు. తన కూతురు పారిపోయిందని .. ఆమె ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు, ప్రేమికుడితో లేచిపోయింది. కానీ తండ్రి మాత్రం పోలీసులను ప్రలోభాలకు గురించేసి రవిదాస్ను విచారించాలని పురిగోల్పాడు. పోలీసులు కదా .. నాలుగు నోట్ల కట్టలు కనిపించేసరికి సరేనని విచారణ పేరుతో టార్చర్ పెట్టారు.
అకారణంగా ..
వాస్తవానికి ఆ కేసులో రవిదాస్ పేరు లేకున్నా అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో టార్చర్ పెట్టారు. ప్రేమికులను కలిపినందుకు పోలీసులు పెద్ద శిక్షే వేశారు. దీంతో ఆయన వారి వేధింపులు తాళలేక నిన్న అర్ధరాత్రి స్టేషన్ టాయిలెట్లో ఊరేసుకొని చనిపోయాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కొందరు మద్దతుదారులు పోలీసు స్టేషన్ పై రాళ్లురువ్వారు. దీంతో కొందరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. విచారణ పేరుతో కస్టడీకి తీసుకొని టార్చర్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. రవిదాస్ తలపై గాయాలు ఉన్నాయని, ఇదే పోలీసులు వేధించారని చెప్పడానికి సాక్ష్యాలని పేర్కొన్నారు.
సస్పెన్షన్ వేటు
రవిదాస్ జిల్లా జేడీయూ చీప్, సీఎం నితీశ్ జిల్లా కావడం విశేషం. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకుంది. ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టారు. అయితే బీహర్లో అధికార పార్టీ దళిత నేతపై పోలీసులు ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగించింది. దీనిపై విపక్షాలే కాదు స్వపక్షంలోనూ విమర్శలు వస్తున్నాయి. దీంతో వారిని వెంటనే విధుల్లోంచి తప్పింది .. కఠినమైన అట్రాసిటీ కేసు పెట్టి ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చింది నితీశ్ సర్కార్.