కుప్పకూలిన వేదిక: ఐశ్వర్య రాయ్ తండ్రికి తప్పిన ప్రమాదం - తేజ్ ప్రతాప్తో పెళ్లి పెటాకులు -జేడీయూలోకి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐశ్వర్య రాయ్ మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పటి సన్నిహితుడు, మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య.. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పెళ్లాడటం, నెలల వ్యవధిలోనే పెళ్లి పెటాకులై విడాకులకు దారి తీయడం, ఆ కోపంలో చంద్రికా రాయ్.. ఆర్జేడీని వీడి జేడీయూలో చేరడం తెలిసిందే. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రికా రాయ్ సోన్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. తండ్రి తరఫున ఐశ్వర్య కూడా ప్రచారం చేయబోతున్నట్లు వినికిడి. ఈలోపే..
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్
కుప్పకూలిన వేదిక..
సారన్ జిల్లాలోని సోన్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థిగా చంద్రికా రాయ్ శుక్రవారం నామనేషన్ దాఖలు చేశారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ప్రతాప్ రూడీ సైతం వేదికపై ఆసీనులైన ఉండగా.. చంద్రికా రాయ్ ని సన్మానించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వేదికపైకి ఎక్కగా అది ఒక్కసారే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయాలతో బయటపడ్డారు. పెద్ద నేతలకు ప్రమాదం తప్పింది.
కుటుంబాల మధ్య పెళ్లి చిచ్చు
70వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దరోగా ప్రసాద్ రాయ్ మరణం తరువాత ఆయన కొడుకు చంద్రికా రాయ్ ఆర్జేడీలో చేరి, లాలూ ప్రసాద్ కు దగ్గరిమిత్రుల్లో ఒకరిగా మారారు. ఆ సాన్నిహిత్యాన్ని బంధుత్వంగా మలుచుకుంటూ చంద్రికా.. తన కూతురు ఐశ్వర్య రాయ్ ని లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కానీ, నిత్యం దేవుళ్ల వేషాలేస్తూ, అదోరకం ఆథ్యాత్మిక భావనలో ఉండే తేజ్ ప్రతాప్ భార్యను నిర్లక్ష్యంచేశారు. గొడవలు బాగా ముదరడంతో ఒక దశలో ఐశ్వర్య అత్తింట్లోనే ధర్నాకు దిగారు. తనకు అన్నం కూడా పెట్టకుండా వేధింపులకు గురిచేశారంటూ అత్త రబ్రీ దేవి, మరిది తేజస్వీ యాదవ్, ఆడపడుచు మీసా భారతిపై ఐశ్వర్య రాయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా సాక్షిగా రెండు కుటుంబాలూ తగువులాడుకున్నాయి.
టార్గెట్ లాలూ ఫ్యామిలీ..
పెద్దల బలవంతం చేయడం వల్లే ఐశ్వర్యరాయ్ మెడలో తాళి కట్టానని, ఆమెతో కాపురం ఇష్టం లేదని తేజ్ ప్రతాప్ స్పష్టం చేయడంతో వ్యవహారం విడాకులకు దారి తీసింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగానే చంద్రికా రాయ్ కుటుంబం ఆర్జేడీకి గుడ్ బై చెప్పేసి, జేడీయూలో చేరింది. ప్రస్తుత ఎన్నికల్లో జేడీయూ తరఫున బరిలోకి దిగిన చంద్రికా రాయ్.. లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, వాళ్లకు నైతిక విలువలు లేవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి చంద్రికకు మద్దతుగా ఐశ్వర్య రాయ్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లాలూ కుటుంబం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండిపోయింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది.
జడ్జిలపై ఫిర్యాదు: జగన్కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడా