5 నెలల్లో మారిన స్వరం.. మోడీ క్యాబినెట్లోకి వస్తామంటూ సంకేతాలు...
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. వద్దని చెప్పిన పదవులే తీసుకొనేందుకు ముందుకొస్తుంటారు. అవును సంకీర్ణ ప్రభుత్వంలో అలకలు, పట్టు, విడుపులు సహజమే. మోడీ 2.0 క్యాబినెట్లో బెర్తుల కోసం జేడీయూ బెట్టుచేసింది. ఒక్క మంత్రి పదవీ ఇస్తామని చెబితే వద్దని తేల్చిచెప్పింది. క్యాబినెట్లో చేరబోమని అలకబూనింది.
దాదాపు 5 నెలల తర్వాత క్యాబినెట్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలను జేడీయూ ఇచ్చింది. జేడీయూ అధ్యక్ష ఎన్నికలు బుధవారం ఢిల్లీ పార్టీ కార్యాలయంలో జరిగాయి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అధినేతగా మరోసారి నితిశ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవీలో ఆయన మరో మూడేళ్లు కొనసాగనున్నారు.
ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ సిద్ధంగా ఉందని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీలో చర్చ జరుగుతుందని.. తాము ఎన్డీఏ మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. గతంలో ఎందుకు చేరలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బీహార్లో బీజేపీకి డిప్యూటీ సీఎం పదవీ ఇచ్చామని గుర్తుచేశారు. తమకు సరైన గౌరవం లభించాలని కోరుకుంటాం కదా అని పేర్కొన్నారు. అప్పుడు ఒక మంత్రి పదవీ ఇస్తామని చెబితే తిరస్కరించామని కోరారు. తమకు సమాన ప్రాతినిధ్యం, గౌరవం లభిస్తే ఎందుకు తప్పుకుంటామని పేర్కొన్నారు.
2015 బీహార్ అసెంబ్లీలో జేడీయూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం కొనసాగించింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో నెలకొన్న అనిశ్చితి సీఎం పదవీకి నితీశ్ రాజీనామా చేశారు. వెంటనే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జేడీయూ-బీజేపీ మైత్రి కొనసాగుతుంది.