JEE Advanced : పరీక్ష తేదీని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి... ఈసారి ఆ నిబంధనకు చెల్లు...
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 3వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన కేంద్రమంత్రి... పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు తగినంత సమయం ఉందని పేర్కొన్నారు.
Recommended Video
ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్కు ఇంటర్మీడియట్లో 75శాతం మార్కుల నిబంధనను తొలగించారు.కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో గతేడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించి, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కాలేక పోయినవారు ఈసారి నేరుగా అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సాధారణంగా జేఈఈ మెయిన్స్కు అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియట్లో 75శాతం మార్కులు ఉంటేనే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు. ఈ నిబంధనను తొలగించడంతో చాలామంది విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం దక్కనుంది.
ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్,మే నెలల్లో నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి జేఈఈ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. పరీక్షల చివరి రోజు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అంతకుముందు,సీబీఎస్ఈ 10,12 తరగతుల పరీక్షా తేదీలను కేంద్రమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 10 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని... జులై 15న ఫలితాలు ఉంటాయని చెప్పారు.