జేఈఈ మెయిన్ 2021: 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన తొలగింపు
న్యూఢిల్లీ: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కీలక ప్రకటన చేశారు. ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈసారి 12వ తరగతిలో 75 శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను సడలిస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్త(సీఐఎఫ్టీ)లైన ఐఐఐటీ, ఎన్ఐటీ, తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం పోటీ పడే విద్యార్థులు జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)లో అర్హత సాధించడంతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఇంతకుముందు ఉండేది.
అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం ఈ నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఆయా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటు లభించాలంటే జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించడంతోపాటు 12వ తరగతి పరీక్ష పాసైతే చాలు.
12వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించాలన్న నిబంధనను తొలగించారు. కాగా, ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్షలు నాలుగు విడతలుగా జరుగనున్న విషయం తెలిసిందే.
సాధారణంగా జేఈఈ మెయిన్స్ 2 పర్యాయాలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రతి ఒక్కసారి జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు సౌలభ్యాన్ని అందించడానికి ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చునని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం పరీక్షలలో అత్యధిక స్కోర్, ర్యాంకును ప్రవేశాలకు అర్హతగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ 4 విడతల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష మార్చి ఏప్రిల్, మే నెలల్లో మరో 3 విడతల్లో పరీక్ష నిర్వహణ.