జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్ మొదటి పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) పొడిగించింది. జనవరి 23 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 24వ తేదీ వరకు గడువు విధించింది. జనవరి 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని విద్యార్థులకు ఎన్టీఏ తెలిపింది.
గత సంవత్సరం డిసెంబర్ 16న మొదలైన జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అయితే, గోరఖ్పూర్లోని మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ క్రమంలోనే జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
ఈ సంవత్సరం, జేఈఈ మొదటి సెషన్ ఫిబ్రవరి 23, 24, 25, 26, 2021 న నిర్వహించబడుతుంది. పరీక్ష నాలుగు సెషన్లలో జరగాల్సి ఉన్నందున, మార్చి, ఏప్రిల్, మే 2021 నెలల్లోని ఇతర తేదీలను jeemain.nta.nic.in వెబ్సైట్లో చూడవచ్చు.