నేటి నుంచి జేఈఈ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోం.. పకడ్బందీగా ఏర్పాట్లు
ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల కోసం దేశవ్యాప్తంగా అర్హత పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఐఐటీ, ఎన్ఐటీ జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జేఈఈ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో నిర్వహించాల్సిన పరీక్ష కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు దేశ వ్యాప్తంగా పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు ఉంటాయి. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయం దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టంచేశారు.
Recommended Video
జేఈఈ కోసం దేశవ్యాప్తంగా 8 లక్షల 58 వేల 273 మంది హాజరుకానున్నారు. ఏపీ నుంచి 45 వేల మంది వరకు పరీక్ష రాయబోతున్నారు. పపరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డులోని కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి. దానిపై ఫొటో అంటించి సంతకంతోపాటు ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి. గత 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవని పేర్కొనాల్సి ఉంటుంది.
ఆధార్ లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డు తమ వెంట విద్యార్తులు తెచ్చుకోవాలి. రఫ్ వర్కు కోసం ప్రతి సీటు వద్ద ఏ-4 సైజ్ తెల్ల కాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. అదనంగా అవసరమైతే అందచేస్తారు. బయటకు వెళ్లేముందు వర్క్ షీట్లు, అడ్మిట్ కార్డు డ్రాప్ బాక్సులో వేయాలి. లేదంటే జవాబుల మూల్యాంకనం జరగదు. పరీక్ష కేంద్రాల్లో ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు శుభ్రం చేయడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు.
ఏపీలో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, సూరంపాలెం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ థర్మల్ స్కీనింగ్ ద్వారా టెంపరేచర్ పరిశీలిస్తారు. విద్యార్థి పర్సనల్గా శానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తీసుకురావాలని సూచించారు. బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, వాచీలు, బూట్లు కలిగి ఉంటే పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు.