మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?
పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ గుజరాత్కు చెందిన వాడా...? పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఈ నరరూప రాక్షసుడు భారత్లోకి ఎప్పుడు వచ్చాడు... ఎలా ఎంటర్ అయ్యాడు...? అతని పాస్పోర్టు వెల్లడిస్తున్న అంశాలు ఏమిటి...? మసూద్ గురించి పలు విచారణ సంస్థలు చెబుతున్నదేమిటి...?
పార్లమెంటు నుంచి పుల్వామా దాడుల వరకు మసూద్ హస్తం: ఇలాంటి నీచుడినా చైనా వెనకేసుకొచ్చేది...?
1994లో తొలిసారిగా ఢిల్లీ వచ్చిన మసూద్ ఎక్కడున్నాడు..?
జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజార్ భారత్లో తొలిసారిగా జనవరి 1994లో అడుగుపెట్టినట్లు తన పోర్చుగీస్ పాస్పోర్టు వెల్లడిస్తోంది. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల కళ్లు కప్పి భారత్లోకి ప్రవేశించడంపై విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా మసూద్ పాస్పోర్టులోని వివరాలు పరిశీలిచినప్పుడు అతను పోర్చుగీస్ పాస్పోర్టుపై భారత్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో గుజరాత్లో తాను జన్మించినట్లు ఉందని వెల్లడించారు. ఇక తొలి సారి భారత్కు వచ్చినప్పుడు ఢిల్లీలోని వీఐపీ ఏరియా చాణక్యపురి ప్రాంతంలోని అశోక్ హోటల్లో బసచేసినట్లు విచారణాధికారులు తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించిన మసూద్
అశోక హోటల్లో రెండు వారాల పాటు బస చేశారు. అనంతరం జమ్ము కశ్మీర్కు వెళ్లిన సమయంలో ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది. అంతేకాదు ఆ రెండు వారాల్లోనే లక్నో, సహ్రన్పూర్లో జరిగిన ఇస్లాం సెమినార్ దారుల్ ఉల్లూమ్ దియోబంద్కు హాజరైనట్లు ఇంటరాగేషన్ రిపోర్టు పేర్కొంది. బంగ్లాదేశ్లో తన పర్యటన ముగించుకుని పోర్చుగీస్ నకిలీ పాస్పోర్టుపై భారత్కు వచ్చాడని నివేదికలో అధికారులు పొందుపర్చారు. ఇక విచారణ సమయంలో పలు అంశాలు మసూద్ అజార్ వెల్లడించాడు. రెండు రోజుల పాటు ఢాకాలో ఉండి అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు చెప్పాడు. అయితే పోర్చుగీస్ పాస్పోర్టు చూసిన అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్నారని పోర్చుగీస్ పౌరుడిలా కనిపించడంలేదే అన్న అనుమానం వ్యక్తంచేశారని చెప్పిన మసూద్... తాను గుజరాత్లో పుట్టినట్లు చెప్పడంతో వారు వదిలేసినట్లు వెల్లడించాడు. అక్కడి నుంచ ఓ ట్యాక్సీ మాట్లాడుకోని మంచి హోటల్కు తీసుకెళ్లమని డ్రైవర్ను కోరగా అతను హోటల్ అశోకాకు తీసుకెళ్లాడని విచారణ సందర్భంగా మసూద్ చెప్పాడు.
కనాట్ ప్లేస్లోని జనపత్ హోటల్లో బస
ఇక ఒక రోజు రాత్రి తనకు పరిచయం ఉన్న కశ్మీరి వ్యక్తి ఆష్రాఫ్కు ఫోన్ చేస్తే తను అశోకా హోటల్కు వచ్చాడని చెప్పాడు మసూద్. తనతో పాటు అబుమెహమూద్ అనే వ్యక్తి కూడా వచ్చినట్లు మసూద్ చెప్పాడు. అబుమెహమూద్ హరకత్ ఉల్-అన్సర్ ఉగ్రవాద సంస్థ సభ్యుడని చెప్పాడు. దియోబంది మేధావులకు తాను నివాళులు అర్పించాలని కోరినప్పుడు ఆష్రాఫ్ దార్ తన మారుతీ కారులో తీసుకెళ్లినట్లు మసూద్ వెల్లడించాడు. దియోబంద్లోని దారుల్ ఉలూమ్లో ఆ రాత్రికి బసచేసి మరుసటి రోజు నివాళులు అర్పించి గున్గోవ్కు వెళ్లి అక్కడి నుంచి సహరనపూర్కు చేరుకున్నట్లు అధికారులతో మసూద్ చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇక సహరనపూర్లోని ఓ మసీదులో ఆ రాత్రి బసచేసిన మసూద్ తను ఎవరో తన అసలు పేరేంటో ఎక్కడా బయటపెట్టలేదని వెల్లడించాడు. ఇక జనవరి 31 1994లో అదే మారుతీ కారులో ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపాడు. ఇక ఈసారి కనాట్ ప్లేస్లోని జనపత్ హోటల్లో మసూద్ అజార్ బసచేసినట్లు తెలుస్తోంది.
లక్నోకు బస్సులో వెళ్లిన మసూద్
ఇక శ్రీనగర్కు వెళ్లేందుకు ఫిబ్రవరి 9న విమానం ఉండటంతో ఆలోపు అలిమియా అనే వ్యక్తిని లక్నోలోని మదర్సాలో కలవాలని భావించినట్లు మసూద్ చెప్పాడు. అలీని కలిసేందుకు ఫిబ్రవరి 6వతేదీన అజర్ లక్నోకు బస్సులో వెళ్లాడు. ఇక అలిమియాను కలిసేందుకు అవకాశం దొరకకపోవడంతో తిరిగి బస్సులోనే లక్నో చేరుకున్నాడు. ఈ సారి కరోల్బాగ్లోని శీష్మహల్ హోటల్లో బసచేశాడు. అయితే ఢిల్లీలో కాలుమోపిన నాటినుంచి అతను ఎక్కడైతే బసచేశాడో అక్కడ తన పేరును వలి ఆదాం ఇస్సాగా నమోదు చేసుకున్నాడు మసూద్ అజార్.
అనంత్నాగ్లో భారత భద్రతా దళాలకు చిక్కాడు ఇలా
ఫిబ్రవరి 8, 1994లో తను నిజాముద్దీన్కు వెళ్లి అక్కడ కొన్ని కంపాస్లు కొన్నట్లు చెప్పిన మసూద్ అజార్... అవి కశ్మీర్లోని మిలిటెంట్లకు బహూకరించేందుకు కొన్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 9న శ్రీనగర్కు చేరుకున్న తర్వాత విమానాశ్రయం నుంచి ఆష్రాఫ్ దార్ లాల్బజార్లోని మదర్సాలో తనకు బస ఏర్పాటు చేసినట్లు మసూద్ తెలిపాడు. ఆ రోజు సాయంత్రం సజ్జద్ అఫ్ఘానీ తన మిత్రుడితో కలిసి వచ్చాడని ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న పాక్ ఆక్రమిత కశ్మీర్లో పలువురు ఉగ్రవాదులతో సమావేశం అయినట్లు తెలిపాడు. ఇక్కడే జైషేమహ్మద్ సంస్థతో హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామి సంస్థ విలీనం అయినట్లు తెలిపాడు. ఇక పాకిస్తాన్లో నివసిస్తున్న తమ కుటుంబాలకు చెందిన అడ్రస్ తీసుకున్నట్లు చెప్పిన ఆయన వారి సంక్షేమం చూసుకునే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు మసూద్ విచారణాధికారులతో తెలిపాడు.
ఇక మతిగండ్ నుంచి అఫ్ఘాని, ఫరూక్లతో కలిసి వస్తున్న సమయంలో తాము ప్రయాణిస్తున్న కారు నిలిచిపోయిందని... దీంతో ఆటోలో అనంత్నాగ్ వైపు వెళ్లినట్లు వెల్లడించాడు. మూడు కిలోమీటర్ల మేరా ప్రయాణించగానే ఆటోను ఆర్మీ జవాన్లు తనిఖీల్లో భాగంగా నిలిపారని వివరించిన మసూద్... ఫరూఖ్ వెంటనే ఆటో దిగి పరుగులు తీస్తూ కాల్పులు జరిపినట్లు వెల్లడించాడు. ఫరూఖ్ తప్పించుకున్నాడు కానీ తనతో పాటు మరో వ్యక్తి అఫ్ఘానీని అరెస్టు చేసినట్లు మసూద్ విచారణాధికారులతో వెల్లడించాడు. ఇక 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేసి మసూద్ను విడుదల చేయాలన్న డిమాండ్ ఉగ్రవాదులు చేయడంతో కాందహార్లో అజార్ను అప్పగించడం జరిగింది.