దసరా వేళ.. మారణ హోమానికి కుట్ర: జైషె మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్
శ్రీనగర్: దేశం మొత్తం దసరా పండుగ వేడుకల్లో మునిగి ఉన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదులు భారీగా పేలుళ్లను సృష్టించడానికి కుట్ర పన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడి తరహాలోనే.. మరిన్ని దాడులు చేయడానికి ఉగ్రవాదులు వేసుకున్న ప్లాన్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. మొహసిన్ మన్సూర్ సల్హియా అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడులకు అతనే సూత్రధారిగా అనుమానిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో నివసించే మన్సూర్.. క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదిగా గుర్తించారు పోలీసులు. దసరా వేళ జమ్మూ కాశ్మీర్ లో దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. మన్సూర్ వద్ద నుంచి మారణాయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తమకు పక్కాగా అందిన సమాచారంతో బారాముల్లా ఓల్డ్ టౌన్ లో నివసించే అతని ఇంటిపై పోలీసులు దాడి చేశారని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని వెల్లడించారు. విచారణ సందర్భంగా అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.
బారాముల్లాలో తనకు పరిచయం ఉన్న మరో ముగ్గురు యువకులకు ఉగ్రవాద భావజాలాన్ని రుద్దాడని, త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అన్నారు. దీనికోసం సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉందని, మన్సూర్ విచారణ సమయంలో.. ఈ ముగ్గురి వివరాలను రాబట్టుకుంటామని దిల్బాగ్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జైషె మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదుల కన్ను ఆ రాష్ట్రంపై పడినట్లు చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా భారీగా దాడులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదంటూ ఇదివరకే ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. గుజరాత్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్ వరకు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటున్న అన్ని ప్రాంతాల నుంచీ భారత్ లోకి చొరబడటానికి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించి విఫలమయ్యారు. దీనికి సంబంధించిన ఫుటేజీలను సైతం సైన్యాధికారులు విడుదల చేశారు. 500 మందికి పైగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ కు చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండోలు సరిహద్దుల్లో మాటు వేశారని, ఏ క్షణమైనా వారు మనదేశ భూభాగంపై ప్రవేశించవచ్చంటూ హెచ్చిరకలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ కే చెందిన ఉగ్రవాది పట్టుబడటం సంచలనం రేపుతోంది.