విమానాన్ని ఢీ కొట్టిన బస్సు: నిద్రమత్తే కారణమన్న డ్రైవర్
కోల్కత్తా: కోల్కత్తా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై నిలిచి ఉన్న విమానాన్ని వేగంగా దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టింది. వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం 6.30 గంటలకు ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్వేస్కు చెందిన బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలుపాలవండగానీ చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ప్యాసింజర్స్ ను విమానం వద్దకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సు మరింత వేగంగా వచ్చి విమానాన్ని ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. అలా కాకుండా విమానాన్ని ఢీకొన్న బస్సు విమానం ఇంజిన్కు కాస్తంత దూరంగానే నిలిచింది.
ఈ ఘటన జరగడానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారు. సమాచారం లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తమ ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్కు వెళ్లాల్సి ఉంది.
దీంతో బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వైద్యపరీక్షల అనంతరం జరిపిన విచారణలో నైట్ డ్యూటీలో ఉండడంతో నిద్రను ఆపుకోలేకపోయానని, కునికిపాట్లు పడుతూ నిద్రమత్తులో బస్సును ఢీ కొట్టానని డ్రైవర్ మెమిన్ అలీ విచారణలో చెప్పాడని కోల్కత్తా విమానాశ్రయాధికారులు వెల్లడించారు.
కాగా, సోమవారం రాత్రి డ్యూటీలో ఉన్న మొమిన్ అలీ మంగళవారం తెల్లవారుజామున కునికిపాట్లు పడుతూ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టాడు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు విమానయాన శాఖ ఆదేశించింది. ఈ ఘటన కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సిన రెండు విమానాలను అధికారులు రద్దు చేశారు.
కాగా, మొమిన్ అలీ ఢీ కొట్టిన విమానం విలువ 400 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు. విమానంలో చాలా భాగం దెబ్బతిందని వారు వెల్లడించారు.