జెట్ ఎయిర్వేస్కు తప్పిన ప్రమాదం: పక్షి తాకి, మంటలు వచ్చాయి
ఖాట్మాండు: నేపాల్లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొంది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ విమానం ముంబై నుండి వెళ్లింది. విమానాశ్రయానికి చేరువ అయ్యే సమయంలో పక్షి ఢీకొంది. ప్రయాణీకులు అందరు కూడా సురక్షితంగా ఉన్నారని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (టీఐఏ)అధికారులు తెలిపారు. పక్షి తగలడం, మంటలు చెలరేగిన నేపథ్యంలో ఇంజనీర్లు విమానాన్ని పరిశీలిస్తున్నారు.
డామేజ్ అయిన ప్రాంతాన్ని సరి చేస్తున్నారని చెప్పారు. బోయింగ్ 737-800 విమానం ఉదయం 11.20 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. పక్షి తగిలిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది. కాగా, త్రిభువన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో పక్షులు విమానాలకు తగలడం అసాధారణ విషయమేమీ కాదని కూడా అంటున్నారు. గతంలోను ఇలా జరిగాయని చెబుతున్నారు.