గాలిలో విమానం: ఇంధనం ఖాళీ అయ్యింది
న్యూఢిల్లీ: గాలిలో ఉన్న విమానంలో ఇంధనం దాదాపు పూర్తిగా ఖాళీ అయ్యిందని తెలుసుకున్న ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడిపిన సంఘటన బెంగళూరు- కోచ్చి విమానాశ్రయాల మద్యలో జరిగింది.
విసుగు చెందిన పైలెట్లు ధైర్యం చేసి విమానాన్ని కిందకు దించి వేశారు. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అచ్చం సినిమా స్టోరిలా జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దోహా నుంచి కోచ్చి కి జెట్ ఎయిర్ వేస్ విమానం బయలుదేరింది.
అయితే విమానం గాలిలో ఉన్న సమయంలో ఇంధనం ఖాళీ అవుతున్నదని పైలెట్లు గుర్తించారు. కోచ్చి విమానాశ్రయం చేరుకుంటున్నామని పైలెట్లు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో 152 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో రన్ వే ఎక్కడ ఉందో పైలెట్లు గుర్తించలేక పోయారు. బెంగళూరు- కోచ్చి విమానాశ్రయాల మద్యలో గాలిలో ఆరు సార్లు విమానం చక్కర్లు కొట్టింది.
తమ పని అయిపోయిందని, దేవుడే కాపాడాలని ప్రయాణికులు అనుకున్నారు. విమానంలో ఉండాల్సిన 3,500 కిలోల ఇంధనం కూడా లేదు. గాలిలో చక్కర్లు కొట్టడంతో ఇంధనం దాదాపు ఖాళీ అయిపోయింది. ఓపిక నశించిపోవడంతో పైలెట్లు ధైర్యం చేశారు.
వెంటనే తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మరి కొద్ది నిమిషాలు విమానం గాలిలో నే ఉంటే ఇంధనం పూర్తిగా ఖాళీ అయ్యి కుప్పకూలిపోయి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. విమానం బయలుదేరే ముందు అందులో సరిపడ ఇంధనం ఉందో లేదో పరిశీలించకుండా వెళ్లిన పైలెట్ల మీద డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంటున్నదని తెలిసింది.