330మందితో వెళ్తున్న జెట్ విమానానికి తప్పిన ముప్పు: వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు
జర్మనీ గగన తలంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
ముంబై: జర్మనీ గగన తలంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్ వెళ్తున్న 9డబ్ల్యూ-118 విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
కొలగ్నె గగనతలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారేమోనని జర్మనీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జర్మనీ వైమానిక దళం రెండు జెట్ ఫైటర్ విమానాలను భారత విమానానికి రక్షణగా గగనతలంలోకి పంపింది. ఈ విమానాలు భారత విమానం కమ్యూనికేషన్ను పునరుద్ధరించుకునేందుకు సహకరించాయి.
కొద్ది నిమిషాల తర్వాత సంబంధాలను పునరుద్ధరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో లండన్కు విమానం సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ అధికారప్రతినిధి ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు తెలియజేశారు.