మొక్కకు బదులు ముక్క వడ్డించారు...జెట్ ఎయిర్వేస్ చెల్లించుకుంది భారీ మూల్యం
ఇదొక విచిత్రమైన కేసు. ఒక శాఖాహారికి పొరపాటున మాంసాహారం వడ్డించినందుకు ఏకంగా రూ. 65వేలు జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. ఇంతకీ ఆ శాఖాహారికి మాంసాహారం వడ్డించిదెవరు...? ఎక్కడ వడ్డించారు..? ఇది ఒక హోటల్లో జరిగిన ఘటన అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది జరిగింది గాలిలో ఉన్నసమయంలో... ఏంటి ఇంకా అర్థం కాలేదా...? కస్టమర్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సదరు విమాన సిబ్బంది ఆయనకు మాంసాహారం వడ్డించినందుకు వారు జరిమానా కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మాంసాహారం వడ్డించి అడ్డంగా బుక్ అయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ
వివరాల్లోకెళితే... ప్రముఖ విమానాయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ భాను ప్రసాద్ అనే ప్రయాణికుడికి మాంసాహారం పొరపాటున వడ్డించి అడ్డంగా బుక్ అయ్యింది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భానుప్రసాద్ చెన్నై నుంచి ముంబైకి జెట్ ఎయిర్వేస్ విమానంలో 2016,ఆగష్టు 20న ప్రయాణించాడు. తను వెజిటేరియన్ ఆహారంను ఆర్డర్ చేశాడు. కానీ పొరపాటున మాంసాహారం అతనికి వడ్డించడం జరిగింది. కాస్త తినగానే తాను అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు. వెంటనే వాంతికి చేసుకున్నట్లు చెప్పాడు. వెంటనే తనకు వడ్డించిన ఆహారంను ఫోటో, వీడియో తీశాడు.
జరిగిన నష్టానికి రూ. 7లక్షలు చెల్లించాల్సిందే..!
తాను బ్రాహ్మణుడినని ఇప్పటి వరకు తన జీవితంలో గుడ్డును కూడా రుచిచూడలేదని అలాంటిది తనతో మాంసాహారం తినిపిస్తారా అంటూ జెట్ ఎయిర్వేస్ సంస్థపై వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. తనకు జరిగిన నష్టంపై దావా వేశాడు. రూ.7.25 లక్షలు జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం కట్టాల్సిందిగా పిటిషన్ వేశాడు. తను ఇప్పటి వరకు మాంసాహారం రుచి చూడనందున... సిబ్బంది చికెన్ వడ్డించిందా లేక మటన్ వడ్డించిందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేనని చెప్పాడు.
ముందు శాఖాహారం ఆర్డర్ చేసి ఆ తర్వాత మాంసాహారం అడిగాడు
భానుప్రసాద్ వెర్షన్ ఇలా ఉంటే... విమాన సిబ్బంది వాదన మాత్రం మరోలా ఉంది. ముందు తను శాఖాహారమే ఆర్డర్ చేశారని ... కాసేపు ఆగి తిరిగి ఆర్డర్ మారుస్తూ మాంసాహారం తీసుకురావాల్సిందిగా చెప్పాడని విమాన సిబ్బంది పేర్కొంది.తనకు డెలివర్ అయిన ఫుడ్ ప్యాకెట్ పై నాన్వెజ్ లేబుల్ ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు భాను ప్రసాద్ తీసుకున్న ఫోటో చూస్తే అసలు తను ప్యాకెట్ ఓపెన్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోందని విమానయాజమాన్యం కోర్టుకు తెలిపింది.
మొత్తం రూ.65వేలు జరిమానా కట్టాల్సిందేనన్న కోర్టు
భానుప్రసాద్ లాయరు మాత్రం జరిమానా కట్టాల్సిందేనంటూ వాదించాడు. నాన్వెజ్ తిన్నందుకు భానుప్రసాద్ భార్యతో గొడవైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అయితే విమానాయాన సంస్థ వాదనను కోర్టు అంగీకరించలేదు. అలవాటు లేని మాంసాహారన్ని వడ్డించినందుకు వెంటనే భానుప్రసాద్కు రూ.50వేలు చెల్లించాలని, మానసికంగా క్షోభ పెట్టినందుకు అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని జెట్ ఎయిర్ వేస్ సంస్థను ఆదేశించింది. మరో రూ.5వేలు భానుప్రసాద్ న్యాయపోరాటానికి అయిన ఖర్చుగా గుర్తిస్తూ అదికూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.