తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి.. మహిళలతో కిటకిటలాడుతున్న బంగారం షాపులు..
అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. పేద, ధనిక తేడా లేకుండా ధర ఎంత ఉన్నా తమ స్థాయికి తగ్గట్లు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. ఇక భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మక్కువతోనే మహిళలు అక్షయ తృతీయ రోజున కచ్చితంగా పుత్తడిని కొనుగోలు చేస్తారు. ఇదే అదునుగా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నగల వ్యాపారులు సరికొత్త స్కీములు, డిస్కౌంట్లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
శ్రీవారి భక్తులకు శుభవార్త! అక్షయ తృతీయ డాలర్లు సిద్ధం!
ఉత్తరాది నుంచి వచ్చిన సంప్రదాయం
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఎగబడుతున్నారు. శుభం కలుగుతుందన్న నమ్మకంతో ఉదయం నుంచే బంగారం కొనేందుకు షాపుల వద్ద క్యూ కట్టారు. దీంతో బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిలోనే ఈ సంప్రదాయం ఉండేది. గత కొన్నేళ్లుగా క్రమంగా ఇది దక్షిణాదికి పాకింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకవాసులు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
సరికొత్త డిజైన్ల ఆభరణాలు
అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో బంగారం షాపు యజమానులు సరికొత్త డిజైన్లు అందుబాటులోకి తెచ్చారు. కోల్కతా, ముంబై, రాజ్కోట్ నుంచి రకరకాల డిజైన్ల ఆభరణాలు తెప్పించారు. ముక్కు పుడకలు, ఉంగరాలు, చెవిదుద్దులు. చైన్లు, గాజలు మొదలుకొని కెంపులు, పచ్చలు, అన్కట్ డైమండ్స్ పొదిగిన భారీ హారాల వరకు వివిధ వెరైటీల అభరణాలను మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. తులం బంగారం ధర రూ.30,250 వరకు పలుకుతున్నప్పటికీ చాలా మంది నగల కొనుగోలు కోసం క్యూలు కట్టారు.
ఆఫర్లతో కస్టమర్లకు గాలం
అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులు వివిధ ఆఫర్లతో ముందుకొచ్చారు. కొన్ని షాపులు మేకింగ్ ఛార్జీలు వసూలు చేయమని ప్రకటించగా.. మరికొన్ని తరుగు, మజూరీ లేవని చెబుతున్నాయి. కొందరు వ్యాపారులు గ్రాముకు రూ.250 వరకు తగ్గింపు ప్రకటిస్తే.. మరికొందరు ఎన్ని గ్రాముల బంగారం కొంటే అన్ని గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామని ప్రకటనతో ఊదరగొడుతున్నారు. అయితే ఆఫర్ల ముసుగులో మోసం జరిగే అవకాశమున్నందున కస్టమర్లు జాగ్రత్త వహించాలని నగల తయారీదారులు అంటున్నారు.