'కథువా' మరవకముందే..: జార్ఖండ్ లో మరో మైనర్ బాలికపై హత్యాచారం
న్యూఢిల్లీ: కథువా ఘటనను ఇంకా మరిచిపోకముందే జార్ఖండ్ లోని ధన్బాద్ లో మరో ఐదేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది. నిందితుడిని బాలిక పొరుగింట్లో ఉండే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఏప్రిల్ 30న వెలుగుచూసింది.
ధన్బాగ్ సమీపంలోని బార్తువాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. ఆపై ఆమెను హత్య చేసి అటవీ ప్రాంతంలో పారేశాడు. సోమవారం రాత్రి పోలీసులు అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక హత్యాచార ఘటన వెలుగుచూసిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. సీతాపూర్ ఘటనలో బాలికపై హత్యాచారానికి పాల్పడింది ఆమె దగ్గరి బంధువే కావడం గమనార్హం. పెళ్లికి తీసుకెళ్తానని చెప్పి.. చిన్నారిని తనవెంట తీసుకెళ్లిన డాబ్లూ అనే వ్యక్తి మార్గమధ్యలో ఆమెపై హత్యాచారం జరిపాడు. ఎట్టకేలకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు.