కమలనాథులకు కష్టకాలం: బీజేపీకి ఎదురు తిరిగిన మరో మిత్రపక్షం: ఒంటరిపోరుకు ఎల్జేపీ సిద్ధం
రాంచీ: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్న కమలనాథులకు మరో హైఓల్టేజీ షాక్ తగిలింది. శివసేన కొట్టిన దెబ్బకు అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎదురు తిరిగింది లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ). వచ్చే నెల జరిగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోందా పార్టీ. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఎల్జేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఎల్జేపీ తరఫున ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
మహారాష్ట్రలో ఒక్కటే: మాలెగావ్ లో మజ్లిస్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో..!
50 చోట్ల పోటీ చేస్తాం..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కనీసం 50 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు లోక జనశక్తి పార్టీ జార్ఖండ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లోనూ చర్చించిన తరువాతే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేయడానికి అవసరమైన గెలుపు గుర్రాలను కూడా సిద్ధం చేశామని, సోమవారం సాయంత్రానికి అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు.
ఉన్న 81 సీట్లల్లో 50 చోట్ల ఒంటరిపోరు అంటే..
జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న స్థానాలు 81. ఇందులో కనీసం 50 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఎల్జేపీ సిద్ధం అవుతుండటం బీజేపీకి శరాఘాతమేనని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ జార్ఖండ్ లో బలంగా ఉంది. అధికారంలో కూడా కొనసాగుతోంది. లోక్ జనశక్తి, అఖిల జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజెఎస్యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా కొనాగుతున్నారు. ఈ మూడు పార్టీలతో కలిసి, సీట్లను సర్దుబాటు చేసుకుని ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలనేది బీజేపీ వ్యూహం. ఈ దిశగానే సన్నాహాలు చేస్తోంది.
ఎల్జేపీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంటుందా?
ఉరుము లేని పిడుగులాగా ఎల్జేపీ చేసిన ప్రకటన బీజేపీ అధిష్ఠానానికి కలవరపాటుకు గురి చేయడం ఖాయమని అంటున్నారు. తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎల్జేపీని బుజ్జగించడమో లేదా ఆ పార్టీ వ్యక్తం చేస్తోన్న తాజా షరతులకు తల ఊపడమో చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ ఒకేసారి 50 స్థానాలను వదులు కోవడమంటే మాటలు కాదు. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ.. చివరికి జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) ఆదుకోవడంతో ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది బీజేపీ.
ఎల్జేపీకి అనుకూలంగా ఉంటే బీజేపీ పరిస్థితేంటీ.. ?
జార్ఖండ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం తమ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం అంతర్గత సర్వే ద్వారా తేలడం వల్లే ఎల్జేపీ ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు. ఈ సర్వేలను నిజం చేస్తూ.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్జేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుందంటే బీజేపీకి చుక్కలు కనిపించడం ఖాయమేనని చెబుతున్నారు. ఎందుకంటే- అత్యధిక స్థానాలను గెలుచుకున్నందు వల్ల ఎల్జేపీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం ఖాయమౌతుంది. మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయి, హర్యానాలో కన్ను లొట్టబోయిన చందంగా ప్రభుత్వాన్ని నెలకొల్పిన బీజేపీకి.. జార్ఖండ్ లో నెలకొన్న తాజా పరిణామాలు ఊపిరి తీసుకోనివ్వకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.